year ender 2020 : కరోనా పరీక్షల్లో దేశంలోనే టాప్ త్రీలో ఏపీ- వైరస్కు చెక్ పెట్టిందిలా
ఏపీలో ఈ ఏడాది కరోనా వైరస్ ప్రవేశించిన తర్వాత చాన్నాళ్లకు కానీ ప్రభుత్వం దానిపై దృష్టిసారించలేదు. ఏపీలో తొలుత ఎక్కువగా కేసులు రాకపోవడం, పొరుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు కూడా తక్కువగా ఉండటంతో ఏపీకి ఇబ్బందులు కలగలేదు. కానీ తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల్లో వైరస్ విజృంభణ మొదలయ్యాక అక్కడికి వెళ్లిన ఏపీ వాసుల ద్వారా భారీగా కేసులు రావడం మొదలుపెట్టాయి. దీంతో కరోనా పరీక్షల సంఖ్య కూడా భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఏకధాటిగా సాగుతున్న కరోనా పరీక్షల సంఖ్య తాజాగా కోటి దాటిపోయింది. అయినా ఇప్పటికీ భారీ సంఖ్యలో పరీక్షలు సాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిన ఏపీపై ఇయర్ ఎండర్ కథనం..

రికార్డు స్ధాయిలో ఏపీ కరోనా పరీక్షలు
ఏపీలో కరోనా ప్రభావం మొదలైన నాటి నుంచి క్రమంగా పరీక్షల సంఖ్యను కూడా ప్రభుత్వం పెంచుకుంటూ పోయింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రత్యేక కరోనా ఆస్పత్రుల ఏర్పాటుతో పాటు వివిధ కోవిడ్ సెంటర్లలోనూ భారీగా పరీక్షలు నిర్వహించింది. ప్రతీ రోజూ కనీసం 50 వేల టెస్టులు చేసే స్దాయికి వెళ్లిన ఏపీ కరోనా నియంత్రణలో అగ్రభాగాన నిలిచింది. పొరుగున ఉన్న తెలంగాణలో కరోనా పరీక్షలు నిర్వహించేందకు సైతం ప్రభుత్వం ముందుకు రాకపోగా.. ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా భారీ సంఖ్యలో కరోనా టెస్టులు సాగాయి. దీంతో ఏపీ నెలకో రికార్డు బద్దలు కొట్టింది. భారీగా చేసిన టెస్టుల ఫలితంగా కేసుల సంఖ్య కూడా అదే స్దాయిలో కనిపించింది.

కరోనా పరీక్షల్లో టాప్ 2 పొజిషన్...
దేశంలో అత్యదిక కరోనా పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్దితి ఉన్న రాష్టాల్లో ఒకటిగా ఏపీ ఉండటం, ప్రభుత్వం కూడా అంతే చొరవ చూపడటంతో ఏపీలో భారీగా టెస్టులు జరిగాయి. వీటిలో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులతో పాటు ఆర్టీ-పీసీఆర్, ఇతర స్వాబ్ టెస్టులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను సైతం సంచార టెస్టింగ్ కేంద్రాలుగా మార్చి టెస్టులు నిర్వహించింది. దీంతో ఏపీలో కరోనా పరీక్షలు చేయించుకునేందుకు జనం కూడా భారీగానే ముందుకొచ్చారు. వీటి ప్రభావం కూడా కేసులపై భారీగానే కనిపించింది. ప్రభుత్వం ఒకటికి రెండుసార్లు టెస్టులు నిర్వహిస్తూ, ఇంటింటి సర్వేలతో ప్రతీ కరోనా బాధితుడ్నీ గుర్తించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. వీటి ఫలితమే ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడమని అంతా చెప్పగలిగే పరిస్ధితి.

టెస్టుల నిర్వహణలో సరికొత్త అధ్యాయం
ఏపీలో కరోనా టెస్టుల నిర్వహణలో ప్రభుత్వం కరోనా ఆస్పత్రులు, కోవిడ్ కేంద్రాలు, ప్రైవేటు ఆస్పత్రులు, సంచార వాహనాలు, బస్సులు ఇలా ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టలేదు. దీంతో దేశంలోనే భారీ కోవిడ్ టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా కేంద్రం నుంచి కూడా ఏపీకి ప్రశంసలు దక్కాయి. ఐసీఎంఆర్ సైతం పలుమార్లు ఏపీలో కోవిడ్ టెస్టులు జరుగుతున్న విధానాన్ని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా చూపగలిగింది. విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించడంలోనూ ఏపీ ఎంతో ముందుంది. ఏపీ చేసిన భారీ టెస్టులకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కరోనా ఎప్పుడో నయమైపోయింది. కొన్ని నెలలుగా కేవలం ఏపీలోని ప్రజలకే కరోనా టెస్టులు నిర్వహించుకుంటే సరిపోయే పరిస్ధితి.

విపక్షాల నోళ్లు మూయించిన సర్కార్..
కరోనా వైరస్ మొదలైన కొత్తలో ప్రభుత్వం సరైన నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు విపక్షాల నుంచి ఎక్కువగా వినిపించాయి. అయినా ప్రభుత్వం వెరవలేదు. క్రమంగా టెస్టుల సంఖ్య పెంచుకుంటూ వెళ్లింది. టెస్టుల నిర్వహణలో దేశంలోనే టాప్ 2 పొజిషన్లో చాలా కాలం పాటు ఏపీ ఉండగలిగిం౦ది. దీంతో హైదరాబాద్లో ఉంటూ ప్రభుత్వంపై అంతవరకూ విమర్శలు చేసిన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం డిఫెన్స్లో పడిపోయారు. అత్యధిక టెస్టులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తే బూమరాంగ్ కావడం ఖాయమని వారు గ్రహించారు. దీంతో ప్రభుత్వానికి భారీగా మైలేజ్ కూడా దక్కింది. అదే సమయంలో జనం కష్టాల్లో ఉంటే హైదరాబాద్లో ఉండిపోయారంటూ వీరిపై ఎదురుదాడి చేసే అవకాశం కూడా దక్కింది.












Click it and Unblock the Notifications