year ender 2020- పతాకస్దాయికి జగన్ వర్సెస్ జడ్డీల పోరు-సుప్రీం ఛీప్ జస్టిస్ కోర్టుకు
గతేడాది ఏపీలో భారీ మెజారిటీతో అదికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి ఆ సంతోషం ఎక్కువకాలం మిగల్లేదు. ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై హైకోర్టులో టీడీపీ నేతలతో పాటు ఇతర ప్రత్యర్ధులు కేసులు వేయడం, వాటిలో హైకోర్టు నుంచి ప్రతికూల ఆదేశాలు రావడంతో సీఎం జగన్కు ఈ విషయంలో భంగపాటు తప్పలేదు. ఈ ఏడాది కూడా వరుస ప్రతికూల తీర్పులు కొనసాగడంతో సీఎం జగన్ ఇక చేసేది లేక సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణతో పాటు ఆయనకు మద్దతిస్తున్నారనే కారణంతో హైకోర్టులోని పలువురు న్యాయమూర్తులపై సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్కు లేఖ రాశారు. అంతటితో ఆగకుండా దాన్ని బహిర్గతం చేశారు. ఇది ఈ ఏడాది ప్రభుత్వాన్ని ప్రభావితం చేసిన పలు అంశాల్లో కీలకంగా నిలిచింది.
జగన్ వర్సెస్ జడ్డీల పోరు...
ఏపీలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటికీ ఏ కీలక నిర్ణయం కూడా స్వేచ్ఛగా తీసుకోలేని పరిస్ధితుల్లోకి ఈ ఏడాది వైసీపీ ప్రభుత్వం జారి పోయింది. ప్రజాప్రయోజనమైనా, విప్లవాత్మక సంస్కరణ అయినా, పార్టీకి మేలు చేసేది అయినా ఏ విషయంలోనూ ప్రభుత్వానికి ఈ ఏడాది స్వేచ్ఛ లేకుండా పోయింది. దీనికి ప్రధాన కారణం హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వందల సంఖ్యలో దాఖలైన పిటిషన్లే. వీటిని ఎదుర్కోవడంలోనే ప్రభుత్వానికి ఈ ఏడాది కాలం గడిచిపోయింది. చివరికి తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు న్యాయమూర్తులు కక్షగట్టారంటూ సీఎం జగన్ ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసే దాకా వెళ్లింది.
సీజేఐకి జగన్ ఫిర్యాదుతో కలకలం...
హైకోర్టులో అలా ప్రభుత్వంపై ప్రజాప్రయోజన వాజ్యం పడటం చాలు ధర్మాసనం, న్యాయమూర్తులు ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తుండటంతో ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్ట దిగజారింది. అలాగే కొన్ని చిన్న చిన్న కేసుల్లో సైతం హైకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వడం, ప్రభుత్వం కోరుకున్న విధంగా వాటిపై స్టేలు ఇవ్వకపోవడం, ప్రతీ పిటిషన్పైనా నోటీసులు జారీ కావడం ప్రభుత్వానికి ఈ ఏడాది చికాకుగా మారింది.. దీంతో సీఎం జగన్ ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్కు ఫిర్యాదు చేశారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ మద్దతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టులోని ఏడుగురు న్యాయమూర్తులతో కలిసి కుట్ర పన్నుతున్నారంటూ సీఎం జగన్ ఛీఫ్ జస్టిస్కు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఆ లేఖను తన ముఖ్య సలహాదారు అజేయకల్లంతో విడుదల చేయించారు.
జగన్ లేఖపై ఎటూ తేల్చని ఛీఫ్ జస్టిస్
తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టులోని ఏడుగురు న్యాయమూర్తులతో కలిసి కుట్ర పన్నుతున్నారంటూ సీఎం జగన్ ఛీఫ్ జస్టిస్కు ఫిర్యాదు చేసినా దీనిపై ఎలాంటి చర్యలు వెలువడలేదు. ఈ వ్యవహారంపై స్వయంగా ఛీఫ్ జస్టిస్ ఎస్.ఏ బోబ్డే నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో ఇతర ధర్మాసనాల వద్ద కూడా ఈ వ్యవహారంపై ఎలాంటి ముందడుగు లేదు. దీంతో సీఎం జగన్ రాసిన లేఖపై సుప్రీం ఛీఫ్ జస్టిస్ స్పందించే వరకూ కోర్టు ధిక్కార పిటిషన్లు కూడా వేసేందుకు అటార్నీ జనరల్ అనుమతి ఇవ్వడం లేదు. సీజేఐ స్పందిస్తే తప్ప ఈ వ్యవహారం ముందుకు కదిలేలా లేదు. దీంతో ప్రభుత్వం కూడా చేసేది లేక చేష్టలుడికి చూస్తున్న పరిస్ధితి కనిపిస్తోంది.
తగ్గిన హైకోర్టు దూకుడు- యథావిథిగా తీర్పులు..
హైకోర్టులోని పలువురు న్యాయమూర్తులు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో కలిసి కుట్ర చేశారంటూ సుప్రీం ఛీఫ్ జస్టిస్కు జగన్ లేఖ రాసిన నేపథ్యంలో హైకోర్టు కాస్త దూకుడు తగ్గించినట్లు అర్ధమవుతోంది. గతంతో పోలిస్తే పలు కేసుల విచారణలో హైకోర్టు నుంచి తీవ్రమైన వ్యాఖ్యలు రావడం కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వానికి కూడా ఇది కాస్త ఊరటనిచ్చే అంశంగా మారింది. మరోవైపు సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ స్పందన వచ్చే ఏడాది అయినా వెలువడుతుందా అని జగన్ సర్కారు ఎదురుచూస్తోంది. ఎందుకంటే ప్రస్తుత సీజే బాబ్డే స్ధానంలో జగన్ సర్కారు ఆరోపణలు చేసిన జస్టిస్ ఎన్వీ రమణ వచ్చే ఏడాది ఏప్రిల్లో భాధ్యతలు స్వీకరించాల్సి ఉంది.