Year Ender 2021 : జగన్, చంద్రబాబు, పవన్-ఈ ఏడాదిలో ఎవరెక్కడ ? ఎవరిది పైచేయి ?
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నాయి. ఈ ఏడాది ఆరంభానికి ఏడాదిన్నర గడిచింది. అప్పటి నుంచి ఏడాది చివరి వరకూ చూసుకుంటే సీఎం జగన్ పలు గడ్డు పరిస్ధితుల్ని ఎదుర్కొన్నారు. అయితే ఆ మేరకు విపక్ష నేత చంద్రబాబు కానీ, జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ కానీ ప్రజల్లో మంచి మార్కులు తెచ్చుకోలేకపోయారు. ముఖ్యంగా విపక్షాలతో జగన్ చేస్తున్న పోరాటంలో పెద్దగా ప్రయోజనం కూడా కనిపించడం లేదు. దానికంటే తన సంక్షేమమే జగన్ కు కలిసొస్తుందని ఈ ఏడాది నిరూపించింది.
ఈ ఏడాదిలో వైసీపీ పాలన
ఈ ఏడాదిలో వైసీపీ పాలన పూర్తిగా గాడితప్పింది. మొదటి రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాదిలో అప్పుల భారం పెరగడం, విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, కోర్టుల్లో ఎదురుదెబ్బలు పలు కీలక అంశాల్లో ముందుకు వెళ్లకుండా అడ్డంకులపు కల్పించాయి. ఎంతో కీలకంగా భావించిన మూడు రాజధానుల బిల్లుల్ని వెనక్కి తీసుకోవాల్సి రావడం, ఇంగ్లీష్ మీడియం అమలు కాకుండా సుప్రీంకోర్టులో అడ్డంకులు, ఇటు అమరావతిలో కానీ, అటు విశాఖలో కానీ చెప్పుకోదగిన అభివృద్ధి జరగకపోవడం, కొత్త పరిశ్రమలు రాకపోవడం, అప్పులు పెరిగిపోవడం, కొత్త అప్పులు పుట్టకపోవడం, కేంద్రం నుంచి పోలవరానికి సైతం సహకారం దొరక్కపోవడం వంటి సమస్యలు ఈ ఏడాదిలో ప్రభుత్వాన్ని తీవ్రంగా వెంటాడాయి.
ఈ ఏడాదిలో వైఎస్ జగన్
ఏపీ సీఎంగా రెండున్నరేళ్లు పూర్తిచేసుకోబోతున్న వైఎస్ జగన్ గతేడాదితో పోలిస్తే రాజకీయంగా పాలనపై పట్టు సంపాదిస్తున్నా సమస్యల తీవ్రత దృష్ట్యా ఆ అనుభవం సరిపోవడం లేదు. వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గాడితప్పకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నా నిధుల కొరతతో వాటిలో కోతలు తప్పడం లేదు. అలాగే అమ్మఒడి వంటి కీలకమైన పథకాన్ని ఆరు నెలల పాటు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో అప్రతిహత విజయాలు సాధించడం భారీ ఊరటనిచ్చినా ప్రభుత్వ పాలన విషయంలో జగన్ మాత్రం ఆ స్ధాయి దూకుడుగా వెళ్లలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ విజయాలు తెచ్చిన జోష్ కూడా వైసీపీలో కనిపించడం లేదు.
ఈ ఏడాదిలో చంద్రబాబు
ఈ ఏడాది చంద్రబాబుకు సైతం నిరాశనే మిగిల్చిందని చెప్పవచ్చు. వైసీపీ పాలనలో పలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వెలువడుతున్నా, అభివృద్ధి లేకున్నా ప్రజలు మాత్రం ఎన్నికల్లో వైసీపీకే అండగా నిలిచారు. దీనికి ప్రధాన కారణం కరోనా కష్టాల్లోనూ అమలైన సంక్షేమ పథకాలే. వీటికి ప్రత్యామ్నాయం చూపించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. వీటిలో లోపాల్ని భూతద్దం పెట్టి వెతకడం మినహా చంద్రబాబు చేసిందేమీ లేదన్న భావన సర్వత్రా వినిపిస్తోంది. చివరికి సొంత నియోజకవర్గం కుప్పంలోనూ పరిషత్ ఎన్నికల్లో మొదలైన ఎదురుదెబ్బలు మున్సిపల్ ఎన్నికల్లో పతాకస్ధాయికి చేరాయి. ఇదే పరిస్ధితి కొనసాగితే రేపు కుప్పం అసెంబ్లీ సీటులోనూ చంద్రబాబుకు ఎదురుగాలి తప్పేలా లేదు. దీంతో అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు భువనేశ్వరిని దూషించారంటూ ఏకంగా అసెంబ్లీనే బహిష్కరించి చంద్రబాబు జనంలోకి వెళ్లిపోయారు.
మరింత దిగజారిన పవన్ గ్రాఫ్
ఈ ఏడాది జగన్, చంద్రబాబుతో పోలిస్తే మరింత నష్టపోయింది పవన్ కళ్యాణే. రాజకీయంగా ఇప్పటికే వేసిన పలు తప్పటడుగులతో ప్రాభవం కోల్పోయిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్ని బ్యాలెన్స్ చేయాల్సి రావడం పవన్ కు ఇబ్బందికరంగా మారిపోయింది. అలాగని సినిమాల్ని వదులుకుని రాజకీయాలు చేయలేని పరిస్ధితి. దీంతో పవన్ కళ్యాణ్ అడపాదడపా ఏపీకి వచ్చి రాజకీయవిమర్శలు చేసి వెళ్లిపోతున్నారు. లేదంటే ట్విట్టర్ లో విమర్శలు సంధిస్తున్నారు. కానీ రెగ్యులర్ రాజకీయ నాయకుడిలా మాత్రం పనిచేయలేకపోతున్నారు. దీంతో జనసేన మిత్రపక్షం అయిన బీజేపీలో సైతం ఆశలు ఆవిరవుతున్నాయి. అదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ ప్రారంభించిన పోరు వీరిద్దరికీ మధ్య గ్యాప్ పెంచుతోంది. దీంతో మరోసారి టీడీపీ వైపు పవన్ మొగ్గుచూపుతారన్న అంచనాలు మొదలయ్యాయి. కొత్త ఏడాదిలో దీనిపై మరింత క్లారిటీ రానుంది.