Year Ender 2021 : ఏపీలో జోరు తగ్గిన సంక్షేమం-పెరిగిన ఆర్ధిక భారం-కొత్త అప్పులూ కరవు
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలను అందించింది. ముఖ్యంగా ఈ ఏడాదిని సంక్షేమ పథకాల జోరుతో ప్రారంభించిన జగన్ సర్కార్ ఏడాది చివరికి వచ్చే సరికి మాత్రం నీరుగారిపోయింది. అప్పటికే అమలవుతున్న పథకాల్ని సైతం పూర్తిస్ధాయిలో కొనసాగించలేక కోతలు విధించడం మొదలుపెట్టింది. అంతే కాదు అమ్మఒడి వంటి పథకాల అమలును వాయిదా వేసుకోవాల్సిన పరిస్ధితి కూడా తలెత్తింది. దీంతో ప్రభుత్వం ఆ మేరకు అప్రతిష్ట మూటగట్టుకుంటోంది.

ఈ ఏడాదిలో జగన్ సర్కార్
ఈ ఏడాదిలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాల విషయంలో మిశ్రమ ఫలితాలు లభించాయి. ముఖ్యంగా ప్రభుత్వం అట్టహాసంగా మొదలుపెట్టిన పలు సంక్షేమ పథకాలను మధ్యలోనే కోతలు విధించాల్సిన పరిస్ధితి తలెత్తింది. ముఖ్యంగా సామాజిక పెన్షన్లతో మొదలుపెట్టి అమ్మఒడి, ఇతర పథకాల విషయంలోనూ కోతలు తప్పలేదు. దీంతో ప్రభుత్వం ఆ మేరకు లబ్దిదారుల ఆగ్రహం చవిచూడక తప్పలేదు. సంక్షేమ పథకాల కోసం భారీ ఎత్తున ఖర్చు పెట్టేందుకు నిధులు సరిపోకపోవడమే ఇందుకు కారణం.

హామీల అమలుపై నీలి నీడలు
వైసీపీ ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభంలో మాత్రం హామీల విషయంలో కాస్త సానుకూలంగా కనిపించింది. కానీ ఏడాది మధ్యకు వచ్చే సరికి మాత్రం నీరుగారిపోయింది. పలు సంక్షేమ పథకాల్లో కోతలు విధిస్తారంటూ మొదలైన ప్రచారం కాస్తా నిజమని తేలిపోయింది. దీంతో పాటు కొత్తగా ఓటీఎస్ వంటి పథకాలను తీసుకొచ్చి జనాల నుంచి డబ్బులు గుంజుతున్నారంటూ నెగెటివ్ ప్రచారం కూడా మొదలైంది. దీంతో ఇది స్వచ్చందమే అని చెప్పుకునేందుకు సర్కార్ నానా తంటాలు పడుతోంది. అన్నింటికీ మించి గతంలో వైసీపీ ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా అమలవుతాయా లేదా అన్ను అనుమానాలు మాత్రం ఈ ఏడాదిలో తొలిసారి కలిగాయి.

పెరిగిపోతున్న ఆర్ధిక భారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలతో ఆర్ధిక భారం పెరిగిపోతోంది. పలు సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించలేక ఆర్ధిక మంత్రి బుగ్గన సైతం చేతులెత్తేస్తున్న పరిస్దితి కనిపిస్తోంది. అలాగే ఆయన ఢిల్లీలోనే రోజుల తరబడి ఉండిపోయి కేంద్రంతో లాబీయింగ్ చేయాల్సి వస్తోంది. అయినా నిధులు మాత్రం విడుదలయ్యే మార్గాలు కనిపించడం లేదు దీంతో నిధుల కోసం కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నారు. ఇందులో భాగంగా పుట్టుకొచ్చినవే ఓటీఎస్ వంటి పథకాలు. ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజల్లో నెగెటివ్ మార్కులు వేస్తున్నాయి.

అప్పుల మీద అప్పులు
ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అప్పులు చేయక తప్పని పరిస్ధితి. అదే సమయంలో గతంలో చేసిన అప్పులకు వడ్డీలు తప్పనిసరిగా కట్టాల్సిన పరిస్దితి.ఇందులో ఎక్కడ తేడా వచ్చినా అంతే సంగతులు. ఉదాహరణకు జెన్ కో గతంలో చేసిన అప్పులు తీర్చకపోవడంతో దాన్ని కేంద్రం నిరర్ధక ఆస్తుల జాబితాలో చేర్చేసింది. అలాగే కేంద్ర విద్యుత్ సంస్ధలకు చేసిన అప్పులు తీర్చకపోవడంతో కేంద్రం నుంచి అధికారులు రాష్ట్రానికి వచ్చి మరీ హెచ్చరికలు చేసి వెళ్లారు. అలాగే కార్పోరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు కూడా పరిమితి దాటిపోవడంతో ఇక కొత్త అప్పుల కోసం కొత్త కార్పోరేషన్లను ఏర్పాటు చేయాల్సిన పరిస్ధితులు తలెత్తుతున్నాయి.

చుక్కలు చూపిస్తున్న కేంద్రం
రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని సకాలంలో విడుదల చేయాల్సిన కేంద్రం.. ఏపీ విషయంలో సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. అలాగే ఏపీ ప్రభుత్వం బయటినుంచి తీసుకునే అప్పుల విషయంలోనూ సవాలక్ష నిబంధనలు విధిస్తోంది. దీంతో ప్రభుత్వం బయటి నుంచి కూడా అప్పులు తీసుకురాలేని పరిస్ధితి నెలకొంటోంది. కేవలం కేంద్రం ఇచ్చే జీఎస్టీ వాటా నిధులు, ఇతర గ్టాంట్లపైనే ఇప్పుడు ఆధారపడాల్సిన పరిస్దితులు ఉన్నాయి. గతేడాది కరోనా సమయంలో అదనపు అప్పులు తెచ్చుకునేందుకు అవకాశం కల్పించిన కేంద్రం ఇప్పుడు దాన్ని కూడా తీసేసింది. దీంతో వైసీపీ సర్కార్ కు చుక్కలు కనిపిస్తున్మాయి. మరి కొత్త ఏడాదిలో అయినా కేంద్రం కరుణిస్తుందో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications