Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Year Ender 2022 : పవన్ గ్రాఫ్ పెంచిన ఏడాది-గెలుపుపై డౌట్ల నుంచి సీఎం రేస్ వరకూ-టర్నింగ్ ఇదే !

పాతికేళ్ల రాజకీయమంటూ జనసేనతో పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు ఈ ఏడాది మంచి ఫలితాలనే అందించింది. ముఖ్యంగా ఏపీలో వైసీపీ సాగిస్తున్న ఏకపక్ష రాజకీయాల నేపథ్యంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు ప్రత్యామ్నాయశక్తిగా పవన్ బలంగా తెరపైకి వచ్చారు. గతేడాది వరకూ పవన్ అంటే లైట్ తీసుకున్న వారంతా ఈ ఏడాది మాత్రం అదే మాటను రిపీట్ చేసేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలు నిత్యం పవన్ పై సాగిస్తున్న మాటల యుద్ధం చూస్తుంటే పవన్ ఈ ఏడాది ఏం సాధించాడో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

 పవన్ పాలిటిక్స్

పవన్ పాలిటిక్స్

ఏపీలో 2019 ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న జనసేన పార్టీని తిరిగి పట్టాలకెక్కించక తప్పని పరిస్ధితుల్లో చంద్రబాబు కంటే ముందు పోరు మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్.. వ్యూహాత్మకంగానే ముందుకు సాగారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బీజేపీతో మరోసారి పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్.. మరో రాజకీయానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ధిక్కరించి ఏమీ చేయలేమని అర్ధం చేసుకున్న పవన్.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని సేఫ్ గేమ్ మొదలుపెట్టారు. కరోనా సమయంలో కనిపించకపోయినా ఆ తర్వాత తన మార్కు చూపిస్తూ వెళ్లారు. బీజేపీతో పొత్తున్నా జనసేన పార్టీని ఎక్కడా ఆ పార్టీతో కలిసి ఉద్యమాలు చేయకుండా జాగ్రత్త పడ్డారు. తద్వారా పేరుకే బీజేపీ పొత్తు, రాజకీయమంతా తన ఇష్టప్రకారమే ఉండేలా చూసుకున్నారు. తద్వారా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు బీజేపీయే తనపై ఆధారపడేలా చేయగలిగారు.

 పవన్ కు మరపురాని ఏడాది

పవన్ కు మరపురాని ఏడాది

పవన్ కళ్యాణ్ కు ఇన్నాళ్లు చేసిన రాజకీయం ఓ ఎత్తు, ఈ ఏడాది రాజకీయం మరో ఎత్తులా మారింది. ముఖ్యంగా కరోనా తర్వాత తిరిగి యాక్టివ్ అవుతున్న క్రమంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని గద్దెదింపేందుకు జనంలో విశ్వాసం కోల్పోయిన టీడీపీ కంటే తానే ప్రత్యామ్నాయం అనిపించుకునేందుకు మంచి అవకాశం దొరికింది. దీంతో సొంత రాజకీయానికి పదునుపెట్టడం ద్వారా బీజేపీపై ఒత్తిడి పెంచారు. వైసీపీపై పోరుకు రోడ్ మ్యాప్ ఇమ్మంటూ బీజేపీపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టిన పవన్.. విశాఖలో వైసీపీ గర్జన తర్వాత తలెత్తిన పరిస్ధితుల్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. చివరికి ప్రధాని మోడీ తనను పిలిచి మాట్లాడే స్ధాయికి వచ్చారు.

 విశాఖ టూర్ టర్నింగ్

విశాఖ టూర్ టర్నింగ్

విశాఖలో మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ వికేంద్రీకరణ గర్జన పెట్టింది. అదే రోజు విశాఖ టూర్ ప్లాన్ చేసుకున్న పవన్.. ఉదయం గర్జన జరిగినప్పుడు వెళ్లకుండా అది ముగిశాఖ మధ్యాహ్నానానికి అక్కడికి వెళ్లారు. తన రాక కోసం ఎదురుచూస్తున్న జనసేన కార్యకర్తలు వైసీపీ మంత్రుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ప్రభుత్వం వారిపై కేసులు పెట్టింది. అదే సమయంలో విశాఖలో పర్యటించకుండా హోటల్ కే పవన్ ను పరిమితం చేసింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న పవన్ 24 గంటల పాటు అక్కడే ఉన్నారు. చివరికి విజయవాడ బయలుదేరి వచ్చారు. వచ్చీ రాగానే పార్టీ కార్యాలయం చేరుకుని వైసీపీ నేతలపై బూతులతో రెచ్చిపోయారు. అదే సమయంలో బీజేపీకి కూడా రోడ్ మ్యాప్ ఇవ్వకపోతే రాంరాం చెప్పేస్తానని హెచ్చరికలు పంపారు. అదే రోజు చంద్రబాబును కలిసి ఉమ్మడి పోరు ప్రకటించారు. దీంతో బీజేపీలో కలవరం మొదలైంది.

 మైలేజ్ పెంచిన మోడీతో భేటీ

మైలేజ్ పెంచిన మోడీతో భేటీ

విశాఖ నుంచి విజయవాడ తిరిగి వచ్చేశాక చంద్రబాబుతో భేటీ అయి ఉమ్మడి పోరు ప్రకటించిన పవన్ ను తిరిగి దారిలోకి తెచ్చుకునేందుకు బీజేపీ ప్రధాని మోడీతో భేటీ ఏర్పాటు చేసింది. విశాఖకు అభివృద్ధి కార్యక్రమాల శంఖుస్ధాపనల పేరుతో వచ్చిన ప్రధాని మోడీ.. వచ్చీ రాగానే పవన్ ను పిలిపించుకుని మాట్లాడారు. అనంతరం బీజేపీ నేతలకు సైతం దిశానిర్దేశం చేశారు. చివరకు పవన్ ను చంద్రబాబుకు దూరంగా ఉండమని, బీజేపీ-జనసేన పొత్తు కొనసాగిద్దామని నచ్చజెప్పి పంపారు. ఇక్కడ జనసేన-టీడీపీ పొత్తు కుదరకపోయినా పవన్ కు మాత్రం ఎక్కడలేని మైలేజ్ వచ్చేసింది. దీంతో పవన్ రాజకీయం ఇప్పుడు వైసీపీ, టీడీపీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది.

 సీఎం రేసులోకి పవన్ ?

సీఎం రేసులోకి పవన్ ?

గతంలో ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ మరోసారి పోటీ చేస్తే గెలుస్తారా లేదా అన్న సందేహాలు ఉండేవి. కానీ ఏడాది మారిన పరిణామాలతో జగన్ కు పవన్ ప్రత్యామ్నాయం కాగలడనే సంకేతాలను పంపడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అంతే కాదు కేంద్రం మద్దతు తమకే ఉందంటూ ప్రచారం చేసుకుంటున్న జగన్ ను కాదని పవన్ తో మోడీ విశాఖలో ముందుగా భేటీ కావడం జనసేనాని మైలేజ్ ను మరింత పెంచింది. ఇప్పుడు రాష్ట్రంలో కాపులకు సీఎం పదవి డిమాండ్ తో ఆ సామాజిక వర్గ నేతలు పార్టీలకతీతంగా భేటీలు పెట్టి ఒత్తిడి పెంచుతున్నా, గోదావరి జిల్లాల టూర్ లో చంద్రబాబు కాపులకు సీఎం పదవి ఇచ్చేందుకూ సిద్ధమంటూ సంకేతాలు పంపడం వెనుకా పెరిగిన పవన్ గ్రాఫ్ కనిపిస్తోంది. దీంతో ఇప్పటివరకూ 2024 సీఎం రేసులో ఉన్న జగన్, చంద్రబాబుకు తోడు పవన్ కూడా వచ్చి చేరిపోయారు. ఇది జనసేన ఆవిర్భావం తర్వాత పవన్ కు ఈ స్ధాయి మైలేజ్ రావడం ఇదే తొలిసారి కూడా. మరి కొత్త ఏడాదిలో పవన్ దీన్ని సద్వినియోగం చేసుకుంటే మరిన్ని ఎత్తులకు చేరడం ఖాయం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+