సురేశ్: ఘరానా మోసగాడు, మంత్రి ప్రత్తిపాటి పేరు చెప్పి దోచేస్తున్నాడు
అమరావతి: 'ప్రత్తిపాటి' ఈ ఇంటి పేరు ఆంధ్రప్రదేశ్లో అందరికీ సుపరిచితం. ఎందుకంటే గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇంటి పేరు కాబట్టి. అయితే ఇదే ఇంటి పేరుని కలిగి ఉన్న ప్రత్తిపాటి సతీశ్ అనే యువకుడు టీడీపీ అగ్రనేతలతో దిగిన ఫోటోలను ఎరగా వేసి, నిరుద్యోగులైన యువకుల నుంచి రూ. 50 లక్షలు దాకా వసూలు చేశాడు.
తన అల్లుడి ఉద్యోగం కోసం ఇతగాడికి రూ.5.5 లక్షలు సమర్పించికుని, అనంతరం మోసపోయామని తెలుసుకున్న ఓ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లాకు చెందిన ప్రత్తిపాటి సతీష్ (28) రెండేళ్ల క్రితం.. విజయవాడలో ఉంటున్న తన స్నేహితుడి ఇంటికి వచ్చాడు.

అతడి ద్వారా స్థానికంగా ఉన్న యువకులను కొందరిని పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనకు పెద్దనాన్న అవుతారని తాను టీడీపీ క్రియాశీల కార్యకర్తనని అందరినీ నమ్మంచాడు. అంతేనా సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేశ్, మంత్రి దేవినేని ఉమా తదితరులతో దిగిన ఫొటోలు చూపించేవాడు.
అంతేకాదు స్థానికి టీడీపీ కార్యాలయంలో నందమూరి బాలకృష్ణ, మోక్షజ్ఞ, నారా రోహిత్ల పుట్టినరోజుల వేడుకలను నిర్వహించేవాడు. టీడీపీ శ్రేణుల వేడుకలకు, బాలకృష్ణ చిత్రాలు విడుదల సందర్భంగా పైపులరోడ్డు సెంటర్లో భారీ ఫెక్సీలను ఏర్పాటు చేసేవాడు.
వీటన్నింటిని చూసి ఇతగాడిని బాగా నమ్మిన యువకులకు మాయమాటలు చెప్పి, ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానని మోసం చేయడం మొదలు పెట్టాడు. విజయవాడలోని శాంతినగర్ ప్రాంతానికి చెందిన సుమన్కు కృష్ణపట్నం పోర్ట్లో కస్టమ్స్ విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.3.50 లక్షలు తీసుకున్నాడు.
సుమన్ను కృష్ణపట్నం తీసుకెళ్లి ఉద్యోగం ఖరారైనట్లు నకిలీ పత్రం ఇచ్చాడు. దాన్ని చూసి నిజమని నమ్మిన మరికొందరు యువకులు సతీష్ మోసానికి బలయ్యారు. శాంతినగర్ మసీదు వద్ద నివసించే కిశోర్ అనే యువకుడికి, అతడి స్నేహితుడు గోపీకి.. కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చెరో రూ.2 లక్షలు తీసుకున్నారు.
భవానీపురానికి చెందిన కారెడ్ల వరలక్ష్మి అనే మహిళ అల్లుడికి జిల్లా పరిశ్రమల కేంద్రంలో ఉద్యోగం, ఇల్లు ఇప్పిస్తానంటూ రూ.5.50 లక్షలు తీసుకున్నాడు. రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న సతీశ్ ఎప్పటికప్పుడు వీరితో ఫోన్లో టచ్లో ఉంటూ త్వరలోనే ఉద్యోగాలు వచ్చేస్తాయంటూ నమ్మించేవాడు.
చివరకు ఇతడి వైఖరిపై అనుమానం వచ్చిన వరలక్ష్మీ నున్న రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సతీశ్పై చీటింగ్ కేసు నమోదు చేశారు. సతీశ్కు డబ్బులిచ్చి మోసపోయి ఆందోళన చెందుతున్న ఇతర బాధితులకు అతడు ఫోన్లో టచ్లోనే ఉండటం విశేషం.
ఉద్యోగాలు రాకుంటే సోమవారం మధ్యాహ్నం 3 గంటలకల్లా డబ్బులు ఇచ్చేస్తానంటూ ఆదివారం రాత్రి ఓ బాధితుడితో ఫోన్లో అతడు నమ్మబలికినట్టు సమాచారం. కేసు నమోదు చేసుకుని పది రోజులు గడుస్తున్నా పోలీసులు ఇతగాడిని అదుపులోకి తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అయితే.. కేసు నమోదు చేసి పది రోజులు గడుస్తున్నా పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని బాధితులు అంటున్నారు. సతీశ్సెల్ ఫోన్ నేటికీ పని చేస్తున్నా పోలీసులు దర్యాప్తు ఎందుకు వేగవంతం చేయడంలేదో, అతణ్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదో అంతుచిక్కడం లేదంటున్నారు.
కొసమెరుపు ఏంటంటే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకి, ఇతగాడికి ఎలాంటి సంబంధం లేదు.












Click it and Unblock the Notifications