రాజీ బాటలో జగన్ - షర్మిల..!? ఏం జరుగుతోంది...!?
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2024 ఎన్నికల ఫలితాల దెబ్బ తో జగన్ లో మార్పు మొదలైంది. అందరినీ దగ్గర చేసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందుకు తల్లి విజయమ్మ చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. జగన్ - షర్మిల మధ్య చాలా వరకు ఆర్దిక వ్యవహారాలు సెటిల్ అయినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో బెంగళూరు కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
మాజీ సీఎం జగన్ మిషన్ 2029 ప్రారంభించారు. పార్టీలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ముందుగా సొంత ఇంటి నుంచే ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. తన కోసం తొలి నుంచి పని చేసి.. రక రకాల కారణాలతో బయటకు వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకునే విషయం పైనా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత అన్న కోసం పని చేసిన చెల్లి షర్మిల గత కొన్నేళ్ళ కాలంగా దూరంగా ఉంటున్నారు. జగన్ సీఎం అయిన తరువాత ఇద్దరి మధ్య మొదలైన విభేదాలు తారా స్థాయికి చేరాయి. తెలంగాణలో పార్టీ ప్రారంభించి.. ఆ తరువాత కాంగ్రెస్ లో విలీనం చేసి.. పీసీసీ చీఫ్ అయిన షర్మిత 2024 లో జగన్ కు వ్యతిరేకంగా పని చేసారు. కడప నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల ప్రచారంలో షర్మిల పైన జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

2024 లో జగన్ పార్టీ ఓడిపోయింది. ఆ తరువాత షర్మిల రాజకీయంగా జగన్ ను టార్గెట్ చేస్తూనే వచ్చారు. వివేకా హత్య కేసులోనూ అవినాశ్ పైన ఆరోపణల సమయంలోనూ జగన్ ను వదల లేదు. ఇక.. జగన్ ఆస్తుల వ్యవహారంలో విజయమ్మ- షర్మిల కోర్టును ఆశ్రయించారు. అటు కూటమి నుంచి రాజకీయంగా జగన్ పైన ఫోకస్ పెరిగింది. ఇదే సమయంలో జగన్- షర్మిల సన్నిహితులు రంగంలోకి దిగారు. విజయమ్మ తోనూ చర్చలు జరిగాయి. విపక్షాలు పదే పదే తల్లి, చెల్లి అంటూ చేస్తున్న ఆరోపణలను ముగింపు పలకాలని నిర్ణయించారు. ఈ మేరకు పలు విడతలుగా జరిగిన చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. షర్మిల తన ఆస్తుల విషయంలో చెబుతున్న పలు అంశాలను జగన్ క్లియర్ చేసేందుకు అంగీకారం తెలిపారని పార్టీ వర్గాల సమాచారం. అదే విధంగా షర్మిల పైన జగన్ ఎప్పుడూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. ఇక నుంచి కలిసి లేకున్నా.. విభేదాలు వద్దని సన్నిహితుల సూచన మేరకు చర్చలు జరిగాయని పార్టీ నేతలు చెబుతున్నారు.
అందులో భాగంగానే తల్లి విజయమ్మ చొరవతో ఇద్దరి మధ్య కీలక అంశాల పైన రాజీ కుదిరిందని.. ఇక రాజకీయ అంశాల పైన మాత్రం తేలాల్సి ఉందని చెబుతున్నారు. కొంత కాలంగా జగన్ పైన షర్మిల రాజకీయంగా దూకుడు తగ్గించారు. త్వరలో షర్మిల పీసీసీ పదవి కాలం పూర్తి కానుంది. కాగా.. ఇప్పుడు షర్మిల- జగన్ మధ్య రాజీ దిశగా చేస్తున్న ప్రయత్నాల పైన పార్టీ ముఖ్య నేతల మధ్య ఆసక్తికర చర్చ సాగుతోంది. దీంతో.. అసలు ఈ రాజీ చర్చలు.. ఇద్దరి మధ్య సయోధ్య పైన అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.














Click it and Unblock the Notifications
