Digital Gold: రూపాయికే బంగారం.. చట్టబద్ధతకు ఆర్బీఐ, సెబీ రెడీ!
భారతదేశంలో పసిడికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుత మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో.. చిరు ఉద్యోగులు, సామాన్యులు ఒకేసారి తులాలు కొనే పరిస్థితి లేదు. అందుకే రూపాయి, రెండు రూపాయలు లేదా రూ. 100తో సైతం చిన్న మొత్తాల్లో డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసే ధోరణి ఇటీవల బాగా పెరిగింది. అయితే, నిబంధనలు లేని ఈ డిజిటల్ గోల్డ్ మార్కెట్పై దృష్టి సారించిన కేంద్ర ఆర్థిక శాఖ, దేశీయ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), సెబీ (SEBI) లకు కీలక బాధ్యతలు అప్పగించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది.
కస్టమర్ కొనే ప్రతీ మిల్లీగ్రామ్కు వాల్ట్లో పసిడి ఉండాల్సిందే!
కొత్తగా రాబోతున్న చట్రం ప్రకారం.. డిజిటల్ గోల్డ్ విక్రయించే కంపెనీలు తాము కస్టమర్లకు డిజిటల్ రూపంలో అమ్మే ప్రతి యూనిట్కు సమానమైన భౌతిక బంగారాన్ని తమ వాల్టుల్లో అత్యంత సురక్షితంగా భద్రపరచాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఎంత బంగారం నిల్వ ఉంది అనే వివరాలపై క్రమం తప్పకుండా ఆడిట్ రిపోర్టులను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF) ల తరహాలోనే డిజిటల్ గోల్డ్ను కూడా 1956 సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ చట్టం పరిధిలోకి తెచ్చి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించాలని భావిస్తున్నారు.

పరిశ్రమ వర్గాల హర్షం.. ఏళ్ల నాటి నిరీక్షణకు తెర!
ఈ నిబంధనల ప్రతిపాదనను డిజిటల్ గోల్డ్ రంగంలోని ప్రముఖ కంపెనీలు, నిపుణులు స్వాగతిస్తున్నారు. విఘ్నహర్త గోల్డ్ ఛైర్మన్ అండ్ ఫౌండర్ మహేంద్ర లునియా మాట్లాడుతూ.. ఇది ఉన్నపళంగా తీసుకున్న నిర్ణయం కాదని, గోల్డ్ టోకనైజేషన్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (EGRs) దిశగా గత కొంతకాలంగా సాగుతున్న కసరత్తులో భాగమేనని చెప్పారు. ప్రస్తుతం వివిధ రకాల భాగస్వాములతో చర్చల దశ నడుస్తోందని, ఇప్పటికే 300 మంది వరకు మేనేజర్లు, స్వతంత్ర ఆడిటింగ్ సంస్థలు ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు సిద్ధమవుతున్నాయని తెలిపారు.
పెరిగిన ధరలు.. సామాన్యుడికి డిజిటల్ గోల్డే శ్రీరామరక్ష!
బంగారం ధరలు ప్రస్తుతం భారీగా పెరిగిన నేపథ్యంలో.. మొదటి జీతం అందుకున్న యువత లేదా చిన్న మధ్యతరగతి కుటుంబాలు షాపుకెళ్లి కొన్ని గ్రాముల బంగారం కొనుగోలు చేయడం కష్టసాధ్యంగా మారింది. జ్యూవెలరీ షాపుల్లో మిల్లీగ్రాముల పరిమాణంలో బంగారం అమ్మరు కాబట్టి, సామాన్యుడికి రూ.100 నుంచి పొదుపు చేసుకునేందుకు డిజిటల్ గోల్డ్ ఒక వరంలా మారింది. ఇప్పుడు ఆర్బీఐ, సెబీ పర్యవేక్షణ కూడా తోడైతే, ఏజెన్సీలు లేదా యాప్లు మోసం చేస్తాయేమోనన్న భయం పూర్తిగా తొలగిపోతుందని, ఫలితంగా ఇన్వెస్టర్ల నమ్మకం రెట్టింపు అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.














Click it and Unblock the Notifications
