కోర్టుకు జగన్: పెన్నా సిమెంట్స్కు కోర్టులో ఎదురు దెబ్బ
హైదరాబాద్: కేసుల విచారణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుల్లో నిందితులైన విజయసాయిరెడ్డి, మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, శ్యాంబాబ్, బ్రహ్మానందరెడ్డి, పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి కూడా ఉన్నారు.
జగన్ అక్రమాస్తులో కేసులో పెన్నా సిమెంట్స్ కంపెనీకి శుక్రవారం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై ఆ సంస్థ దాఖలు చేసిన అప్పీలును డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. ఈడీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసిన డివిజన్ బెంచ్ అభ్యంతరాలుంటే అప్పీలేట్ అథార్టీ ముందు వినిపించుకోవచ్చని సూచించింది.
జగన్ అక్రమాస్తుల కేసులో మనీల్యాండరింగ్కు పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొంటున్న పెన్నా సిమెంట్స్కు చెందిన అనంతపురం జిల్లా, యాడికి మండలంలోని రూ.1.15 కోట్ల విలువైన 231 ఎకరాల భూమిని, హైదరాబాద్లోని పయనీర్ హాలిడే రిజార్ట్స్కు చెందిన 6.69 కోట్ల విలువైన 907 చదరపు మీటర్ల స్థలాన్ని ఈడీ ఈ ఏడాది ఆగస్టు 12న అటాచ చేసింది. దీనిపై పెన్నా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.