YS Jagan Birthday : విజయవాడలో జగన్ బర్త్ డే-600 కిలోల కేక్ ఊరేగింపు-కట్ చేసి వేడుకలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సంబరాలు అప్పుడే మిన్నంటుతున్నాయి. ఇప్పటికే రేపు జరిగే జగన్ పుట్టినరోజు వేడుకలకు భారీ ఏర్పాట్లు సాగుతుండగా.. ఆలోపే రాష్ట్రంలో పలు చోట్ల వైసీపీ అభిమానులు జగన్ బర్త్ డే సంబరాలు మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా ఇవాళ విజయవాడలో 600 కేజీల భారీ కేక్ ను వైసీపీ నేతలు ఊరేగించి కట్ చేశారు.
వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రేపు భారీ కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్న నేపథ్యంలో ఇవాళే పలువురు వైసీపీ నేతలు ఎమ్మెల్సీ తలశిల రఘురాం ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడలో భారీ కేక్ కట్ చేశారు. 600 కేజీల భారీ సైజులో వైసీపీ రంగులతో తయారు చేయించిన ఈ కేక్ ను నగరంలోని గొల్లపూడిలో ఊరేగించారు. భారీ వాహనంపై బెలూన్లు కట్టి ఈ కేక్ ను వీధుల్లో తిప్పారు. అనంతరం ఈ భారీ కేక్ ను వైసీపీ నేతలు కట్ చేసి అభిమానులకు పంచారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు.
సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు ప్రత్యేకంగా సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు వైసీపీ నేతలు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇప్పటికే వేడుకలు ప్రారంభించారు. రెండు రోజులుగా జరుగుతున్నఈ వేడుకలు రేపు పుట్టినరోజు తర్వాత ముగియనున్నాయి. ఈసారి జగన్ పుట్టినరోజును రాష్ట్రంలో అందరికీ గుర్తుండిపోయే స్ధాయిలో నిర్వహించాలని ప్రభుత్వంతో పాటు పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఈసారి వేడుకల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.