స్టీఫెన్ తెలియదు, హోటల్లో హరీష్ రావుని కలిశానా.. ఛాలెంజ్: బాబుపై అరిచిన జగన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు వైయస్ జగన్ మంగళవారం నాడు శాసన సభలో అధికార పార్టీకి సవాల్ చేశారని, జగన్ సవాలును మంత్రి అచ్చెన్నాయుడు స్వీకరించారు. ఇటీవల చర్చకు దారి తీసిన ఓటుకు నోటు అంశం సభలో వేడిని రాజేసింది.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. జగన్ టీఆర్ఎస్కు లేఖ ఇస్తే స్టీఫెన్ సన్కు ఎమ్మెల్సీ పదవి వచ్చిందని చెప్పారు. ఓ హోటల్లో తెలంగాణ మంత్రి హరీష్ రావుతో జగన్ మాట్లాడినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఓటుకు నోటు అంశంతో సీఎంకు సంబంధం లేని విషయమన్నారు.
తమకు తెలంగాణలో 18 మంది ఎమ్మెల్యేలు తమకు ఉన్నప్పటికీ ఒక్క ఎమ్మెల్సీ రాలేదని, వారికి మాత్రం తక్కువ ఉన్నప్పటికీ ఓ ఎమ్మెల్సీ సీటు గెలుచుకున్నారన్నారు. ఏపీలో పుట్టిన నాయకుడు ఏపీ ప్రయోజనాల కోసం మాట్లాడుతాడని, కానీ చంద్రబాబును దెబ్బతీయాలని, ఏపీని నష్టపరచాలని జగన్ చూస్తున్నారన్నారు.
తెలంగాణ ఏపీని ఎన్నో అవమానాలకు గురి చేసిందన్నారు. వాటి పైన ఎప్పుడైనా మాట్లాడుతావా అని ప్రశ్నించారు. విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ తొలగిస్తే ఒక్క మాట అయినా మట్లాడావా అని నిలదీశారు. టిఆర్ఎస్తో కలిసి జగన్ ఏపీ పైన కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

జగన్ సవాల్
టిఆర్ఎస్కు నేను లేఖ ఇస్తే స్టీఫెన్ సన్కు తెలంగాణ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినట్లు చెబుతున్నారని, తాను ఏదో హోటల్లో టి మంత్రి హరీష్ రావును కలిసినట్లు చెబుతున్నారని, కానీ అవన్నీ అవాస్తవాలు అని జగన్ అన్నారు.
నేను టిఆర్ఎస్కు లేఖ ఇస్తే ఆ లేఖ మీ వద్దకు ఎలా వచ్చిందని, ఆయన మీకు ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. అసలు స్టీఫెన్ సన్ ఎవరో తనకు తెలియదని చెప్పారు. టిడిపికి దమ్ము ధైర్యం ఉంటే.. తాను లేఖ ఇస్తేనే స్టీఫెన్ను తెలంగాణ ఎమ్మెల్సీ చేసినట్లు నిరూపించాలని సవాల్ చేశారు.
మంత్రి అచ్చెన్నాయుడు ఏదో హోటల్ పేరు చెప్పారని, అది కూడా తనకు తెలియదన్నారు. నేను సవాల్ చేస్తున్నానని.. తాను లేఖ ఇచ్చినట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని, లేదంటే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. ఛాలెంజ్.. ఛాలెంజ్.. ఛాలెంజ్ అటూ జగన్ గట్టిగా మాట్లాడారు. తనకు ఎమ్మెల్సీలు ఉంటే తానే తనకు నచ్చిన వారిని సభకు పంపిస్తా కదా అన్నారు.
సవాల్ స్వీకరించిన అచ్చెన్నాయుడు
జగన్ చేసిన సవాలును మంత్రి అచ్చెన్నాయుడు స్వీకరించారు. జగన్ కెసిఆర్తో పని చేశారని, అందుకు ఆధారాలున్నాయని, ఇంతకంటే దారుణం మరొకటి లేదని మండిపడ్డారు. జగన్ విషయమై తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పారు.
బాబు సమర్థత చూసి ఓటేశారు: కామినేని
అంతకుముందు, మంత్రి కామినేని శ్రీనివాస్ రావు మాట్లాడారు. చంద్రబాబు చెప్పగానే కేంద్రం పోలవరం బిల్లును ఆమోదించిందన్నారు. చంద్రబాబు సమర్థత చూసి ప్రజలు ఓటేశారన్నారు. పోలవరం బిల్లు ఆమోదించకుంటే తాను ప్రమాణ స్వీకారం చేయనని చంద్రబాబు చెప్పారన్నారు. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే కాపాడగలరన్నారు. టిడిపి - బిజెపి కలిసి ఉంటేనే రాష్ట్రానికి మంచిదన్నారు.












Click it and Unblock the Notifications