కాంగ్రెసుకు మద్దతివ్వం, తలవంచం: వైయస్ జగన్
హైదరాబాద్: కేంద్రంలో మద్దతు విషయంపై మీడియాలో వచ్చిన వార్తలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. తాము కాంగ్రెసుకు కేంద్రంలో మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాకు ఓ లేఖను విడుదల చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెసుకు కేంద్రంలో మద్దతు ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతనే రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తారనే విషయాన్ని గ్రహించి, అందుకు అనుగుణంగా కేంద్రంలో పొత్తు పెట్టుకుంటామని ఆయన చెప్పారు. కేంద్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి మాదిరిగా దాసోహం అనబోమని ఆయన అన్నారు. కేంద్రానికి మెడలు వంచబోమని ఆయన అన్నారు. కేంద్రం మెడలు వంచే విధంగా వ్యవహరిస్తామని ఆయన అన్నారు.

తాము కేంద్రంలో ఫలానావారికి మద్దతు ఇస్తామని ఎక్కడా చెప్పలేదని, ఈ విషయంపై కథనాలు ప్రచురించి అయోమయానికి గురి చేయవద్దని ఆయన అన్నారు. ఆంగ్ల మీడియా కథనాలపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే కేంద్రంలో తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. తాము 25 లోకసభ స్థానాలు గెలుస్తామని ఆయన అన్నారు. కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావాలనే విషయాన్ని తామే నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications