'ఈనాడు' చెప్పింది, ట్యూషన్ చెప్తున్నా: ఏకేసిన జగన్
హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దొంగల లెక్కల విషయం వాళ్ల అధికారిక గెజిట్ ఈనాడు పత్రికలోనే ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసన సభలో అన్నారు. శ్వేతపత్రం అంటే సాక్షి పత్రిక కాదని టీడీపీ విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై జగన్ పైవిధంగా కౌంటర్ ఇచ్చారు. శ్వేతపత్రాల్లో కనీసం ఒక్కచోట కూడా వైయస్ హయాంలో కరెంట్ ఛార్జీలు పెంచలేదని చెప్పలేదన్నారు.
గత పదేళ్లలో ఏ లెక్క ప్రకారం చూసినా అభివృద్ధి బ్రహ్మాండంగా ఉన్నా టీడీపీ మాత్రం గవర్నర్ ప్రసంగం నుంచి బడ్జెట్ ప్రసంగం వరకు ప్రతిచోటా గత ప్రభుత్వాల్ని అనవసరంగా ఆడిపోసుకుంటోందన్నారు. గడిచిన పదేళ్లలో చాలా అన్యాయం జరిగిపోయిందని, అంతకుముందు తాము అద్భుతంగా పాలించామని బాబు సొంత డబ్బా కొట్టుకుంటున్నారన్నారు. ఇప్పుడిచ్చిన హామీలు నెరవేర్చలేక 20 ఏళ్ల కిందకు వెళ్లి అప్పుడు తాము పరిపాలన బాగా చేశామని, ఆ తర్వాత అంతా నాశనమైందంటున్నారన్నారు.
హామీలను నెరవేర్చలేక.. గత ప్రభుత్వాల మీద నెపాన్ని నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం తీరు ఆడలేక మద్దెల ఓడు అనే చందంగా ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఆత్మస్తుతి, పరనింద చేస్తోందన్నారు. జగన్ ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో.. టీడీపీ సభ్యులు లేచి, మీ నుంచి మేం నేర్చుకోనవసరం లేదన్నారు. జగన్ స్పందిస్తూ.. ట్యూషన్ చెబుతున్నానయ్యా.. నేర్చుకోండి అంటూ చురకలంటించారు.
ఎన్నికల ప్రచారంలో బూటకపు హామీలతో టీడీపీ ఊదరగొట్టిందన్నారు. బాబు వస్తాడు.. బంగారం విడిపిస్తాడని టీవీ ఛానళ్లలో ప్రకటనలు గుప్పించారని, డ్వాక్రా అక్కాచెల్లెళ్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. రుణమాఫీ చేస్తామని చంద్రబాబు సంతకం చేసిన కరపత్రాలను టీడీపీ కార్యకర్తలు ఇంటింటికి పంచారన్నారు. ఆయన ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదన్నారు. మాట తప్పడం బాబుకు అలవాటే అన్నారు. రుణమాఫీ చేస్తే సంతోషించని వారెవ్వరు ఉండరన్నారు.
ఏపీ బడ్జెట్ నిరాశను మిగిల్చిందని, టీడీపీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. బడ్జెట్లో ఎవరికీ భరోసా కల్పించలేకపోయారన్నారు. కట్ అండ్ కాపీ, కట్ అండ్ పేస్ట్ పద్ధతిలో బడ్జెట్ తయారయిందన్నారు. లెక్కలు సరిగా లేకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు.
జగన్ నటనను నమ్మలేదు: దూళిపాళ్ల
వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలప్పుడు చాలా నటించారని తెలుగుదేశం పార్టీ నేత దూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. జగన్ నటనా కౌశలాన్ని ప్రజలు నమ్మలేదన్నారు. పాదయాత్ర సమయంలోనే చంద్రబాబు రుణమాఫీ ప్రకటించారని తెలిపారు. రుణమాఫీకి వ్యతిరేకమని జగన్ చెప్పారన్నారు.
జగన్ ఓ ప్రాంతానికే పరిమితం కాబట్టి: యనమల
యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో చెప్పిన వాటిని అన్నీ అమలు చేస్తామన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒకే ప్రాంతానికి పరిమితమైనందున ఒక మేనిఫెస్టో విడుదల చేసిందని, తాము జాతీయ పార్టీగా ఎదిగినందునే రెండు మేనిఫెస్టోలు విడుదల చేశామన్నారు.
కక్కిస్తాం: దేవినేని
కాంగ్రెస్ పార్టీ పాలనలో దోచుకున్నదంతా కక్కిస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. కాంగ్రెసు పాలనలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారన్నారు. జలయజ్ఞంలో దోచుకొని ఇవాళ నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. మరోవైపు, సభ్యులు శాసన సభలో సమయపాలన పాటించాలని సభాపతి కోడెల శివప్రసాద రావు అన్నారు. సభలో సభ్యులు అందరు మాట్లాడే హక్కును వినియోగించుకునేలా సహకరించాలన్నారు.