మరో ఎన్నికల హామీ నెరవేర్చిన జగన్-నేలటూరు జెన్ కో యూనిట్ జాతికి అంకితం-కీలక వ్యాఖ్యలు.
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీజెన్కో ప్రాజెక్టు మూడో యూనిట్ ను సీఎం జగన్ ఇవాళ జాతికి అంకితంచేశారు. అక్కడే ఫిషింగ్ జట్టీ నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు. అనంతరం ప్రజలనుద్ధేశించి బహిరంగసభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడి దయతో ఈరోజు కొన్ని మంచి కార్యక్రమాలు ప్రారంభించడం, కొన్నింటికి శంకుస్ధాపనలు చేయడం జరిగిందన్నారు.
విద్యుత్ రంగంలో ముందడుగు
ఏపీ విద్యుత్ రంగంలో మరో ముందడుగు పడింది. నెల్లూరు జిల్లా నేలటూరులో 800 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మించిన ఏపీ జెన్ కో మూడో యూనిట్ కు సీఎం జగన్ ఇవాళ ప్రారంభోత్సవం చేసారు. అనంతరం దాన్ని జాతికి అంకితం చేశారు. ఈరోజు రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి రంగంలో మరో ముందడుగు వేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఏపీ జెన్కో స్వయంగా నిర్మించిన శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్ల ప్లాంటును ఈ రోజు మీ సమక్షంలో జాతికి అంకితం చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు.
వైఎస్ హయాంలో శంఖుస్ధాపన
ఈ జెన్ కో థర్మల్ పవర్ స్టేషన్కు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీఎం, తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో శంకుస్ధాపన చేశారని సీఎం జగన్ తెలిపారు. ఈ థర్మల్ పవర్ స్టేషన్కు రాష్ట్ర తొలిదళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టుకున్నామని జగన్ పేర్కొన్నారు. దేశంలో తొలిసారి ప్రభుత్వం రంగంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్స్టేషన్ నిర్మాణానికి మహానేత రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారని, ఆయన చొరవతో నేడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ థర్మల్ పవర్ స్టేషన్ను పూర్తి సామర్ధ్యంతో ప్రారంభించడం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నట్లు జగన్ తెలిపారు.
జెన్ కో యూనిట్ ప్రయోజనాలివే
రాష్ట్రంలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వినియోగదారులందరికీ రోజంతా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ థర్మల్ పవర్ స్టేషన్లోని ఈ ప్రాజెక్టుకు రూ.3200 కోట్లు యుద్ధప్రాతిపదికన ఖర్చు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేశామన్నారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలలో దాదాపు 45 శాతం కరెంటు ప్రభుత్వరంగ విద్యుత్ సంస్ధలు ఉత్పత్తి చేస్తున్నాయి.ఇవాళ జాతికి అంకితం చేసిన ఈ ప్లాంటు నుంచి రోజుకి 19 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఏపీ గ్రిడ్కు ఇక్కడ నుంచి సరఫరా అవుతుంది. సాధారణ థర్మల్ విద్యుత్ ప్లాంటుతో పోల్చితే సూపర్ క్రిటికల్ ప్లాంటు తక్కువ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల వెలువడే కాలుష్యం తగ్గుబోతోంది. దీంతో ఈ ప్లాంట్ కోసం భూములిచ్చిన రైతులకు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. దీంతో మరో ఎన్నికల హామీ కూడా నెరవేరిందన్నారు.
చంద్రబాబుపై జగన్ కామెంట్స్
గతంలో తాను ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినప్పుడు స్ధానికులు ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబునాయుడు గారికి మేమంతా గుర్తుకు వస్తామని చెప్పారన్నారు. ఆయన ఐదు సంవత్సరాల పరిపాలనలో చేసిన మంచేమీ లేకపోయినా, హడావుడిగా ఎన్నికలప్పుడు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ మళ్లీ మోసం చేసే ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఆ రోజు తాను అందరికీ నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని చెప్పానని, ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇవాళ 16,337 మత్స్యకారేతర కుటుంబాలు అందరికీ కూడా బటన్ నొక్కి నేరుగా రూ.36 కోట్లు వాళ్ల బ్యాంక్ అకౌంట్లో జమ చేసే కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఆవేళ హడావుడిగా కేవలం మోసం చేసే ఉద్దేశ్యంతో చంద్రబాబు కేవలం 3,500 మందికి అది కూడా రూ.14,000 కూడా సరిగా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయని, ఈ రోజు వాళ్లకి మిగతా సొమ్ము ఇవ్వడమే కాకుండా మిగిలిపోయిన ఆ 12,787 కుటుంబాలకు కూడా మంచి చేస్తూ... మొత్తం అందరికీ కూడా ఈ ప్యాకేజీ ఇస్తున్నామని జగన్ తెలిపారు.