జగన్కు కేంద్రం పిలుపు: ఢిల్లీకి ఏపీ సీఎం -అమిత్ షాతో టైమ్ ఫిక్స్ -మోదీతోనూ భేటీ? -కేసీఆర్ ఫిర్యాదుతో
ఎన్డీఏ మిత్రులు సైతం కాదుపొమ్మన్నా, వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రానికి అండగా నిలిచిన వైసీపీ, అందుకు విరుద్ధంగా ఇటీవల రైతుల భారత్ బంద్ కు మద్దతు ఇవ్వడం.. పలువురు జడ్జిలకు వ్యతిరేకంగా జగన్ ఫిర్యాదుపై వివాదం కొనసాగుతుండటం.. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలతో ఏపీ సర్కారు తీరుపై ఫిర్యాదులు చేయడం.. పోలవరం ప్రాజెక్టు.. వరుస ప్రకృతి విపత్తులు.. తదితర అంశాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రంతో కీలక చర్చలు జరిపేందుకు ఢిల్లీ బయలుదేరనున్నారు..
కరోనా విలయం: రాష్ట్రంలో ఫేక్ డేటా -టెస్టుల గోల్మాల్ -సంచలన కథనం -హైకోర్టు ఆగ్రహం
జగన్ ఢిల్లీ పర్యటన ఖరారు
ఏపీ సీఎం జగన్ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరనున్న ఆయన సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులను సీఎం జగన్ కలవనున్నారు. గత అక్టోబర్ లో మూడు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చిన జగన్.. రెండు నెలల గ్యాప్ తర్వాత హస్తిన బాట పట్టారు. ఈ పర్యటనలో భాగంగా..
అమిత్ షా ఓకే.. మిగతా మంత్రులూ..
ఏపీ సీఎం ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి 9 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాను కలవనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ తోనూ సీఎం భేటీ కానున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతామన్ ను కూడా కలుస్తారని తెలుస్తోంది. సమయానుకూలతను బట్టి ప్రధాని నరేంద్ర మోదీతోనూ జగన్ భేటీ కావొచ్చని సమాచారం. కాగా, ఇప్పటి వరకు అమిత్ షా, షెకావత్ లతో అపాయింట్మెంట్ ఖరారుకాగా, మిగతా కేంద్ర మంత్రులు, ప్రధానితో భేటీపై స్పష్టత రావాల్సిఉంది..
అందుకే వెళుతున్నారా?
ఏపీ వరదాయిని పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో ఇటీవల గందరగోళం నెలకొనడం తెలిసిందే. సవరించిన అంచనాల ప్రకారమే నిధులిస్తామని గతంలో చెప్పిన కేంద్రం.. తాజాగా పాత అంచనాల మేరకే డబ్బులిస్తామని చెబుతోందంటూ వార్తలు రావడం, దీనిపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. సోమవారం పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించిన సీఎం జగన్.. పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. మంగళవారం నాటి ఢిల్లీ పర్యటనలోనూ పోలవరం నిధుల గురించే జగన్ కేంద్రంతో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో..
లేఖరాసిన స్పందించని కేంద్రం
పోలవరం ప్రాజెక్టుతోపాటు ఏపీకి సంబంధించిన ఇతర అంశాలపైనా జగన్ రిప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వివిధ తుపానుల కారణంగా వరదలో నష్టపోయిన ఏపీకి పరిహారం చెల్లించాల్సిందిగా రెండు రోజుల క్రితమే సీఎం.. కేంద్రానికి లేఖరాశారు. దీనిపై కేంద్రం ఇంకా స్పందిచలేదు. మంగళవారం అమిత్షాను కలిసిన సందర్భంలో వరద సాయంపైనా జగన్ అభ్యర్థించనున్నారు. అలాగే, రాష్ట్రవిభజకు సంబంధించిన పెండింగ్ అంశాలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన సమస్యల పరిష్కారంపై కూడా చర్చించే అవకాశముంది. స్థానిక ఎన్నికలు మరింత జాప్యం అవుతోన్న పరిస్థితుల్లో స్థానిక సంస్థలకు నిధుల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. కాగా,
ఢిల్లీలో తెలుగు సీఎంల పంచాయితీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన రెండో రోజే ఏపీ సీఎం జగన్ కేంద్ర పెద్దలను కలవనుండటం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. గత శుక్రవారం కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన సందర్భంలో కేసీఆర్... ఏపీ సర్కారు అక్రమంగా చేపడుతోన్న ప్రాజెక్టులు.. ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఫిర్యాదు చేశారు. సీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై జగన్, కేసీఆర్ ఇద్దరూ ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో ఈ పంచాయితీ కేంద్రానికి చేరింది. తొలుత కేసీఆర్, ఆ వెంటనే టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ కేంద్ర పెద్దలను కలవగా, ఇప్పుడు ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళుతున్నారు.
జగన్ సోషల్ సైన్యం భారీ కుట్ర -జనం సొమ్ముతో రాక్షసం -ఖబడ్దార్ వెధవల్లారా: ఎంపీ రఘురామ సంచలనం