రాక్షసుడిలా చంద్రబాబు, బీహారే నయమనుకుంటారు: తుళ్లూరులో వైయస్ జగన్
విజయవాడ: అధికారమదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాక్షసుడిగా మారాడని ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి అవసమైన భూములను ఏపీ ప్రభుత్వం సేకరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోండి, అంతేకాని బలవంతంగా లాక్కుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
ఈ విషయంలో కోర్టుకు వెళ్లేందుకు కూడా వెనుకాడబోమని ఆయన ప్రకటించారు. ఆదివారం రాత్రి విజయవాడకు వచ్చిన జగన్.. సోమవారం ఉదయం తుళ్లూరు పరిధిలోని మల్కాపూర్లో ఇటీవల దగ్ధమైన చెరకు తోటను పరిశీలించారు. రైతులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పంటలు తగలబడిపోయాయని రైతులు ఫిర్యాదు చేస్తే.. పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 10నెలల్లో ఇలాంటి ఘటనలు 13 జరిగాయని అన్నారు. కేసులు పెడితే నిందితులను అరెస్ట్ చేయరని ఆరోపించారు. స్థానిక డిఎస్పీపైనే కేసు పెట్టాలని అన్నారు.
బీహార్లో జంగిల్ రాజ్యం ఉందంటున్నారు.. వారు ఇక్కడికి వచ్చి చంద్రబాబును పాలనను చూస్తే, తమకన్నా అన్యాయమని రాష్ట్రం ఉందనుకుంటారని అన్నారు. బలవంతంగా రైతుల భూములు లాక్కుంటున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారి పొలాలను తగలబెడ్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని జగన్ విమర్శించారు. చంద్రబాబునాయుడు రాక్షసుడిగా మారాడని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదన్న జగన్.. అధికారంతో మదమెక్కకూడదని అన్నారు. మానత్వం ప్రదర్శించాలని కోరారు. బాధిత రైతులకు తాము అండగా ఉంటామని ఆయన ప్రకటించారు.












Click it and Unblock the Notifications