చంద్రబాబుకు ఆ దమ్ముందా?: సవాల్ విసిరిన జగన్
అనంతపురం: తమ పార్టీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోవడంపై మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి తిరిగి ఎన్నికలకు వెళ్లే దమ్ము, ధైర్యం టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడికి లేదని జగన్మోహన్ రెడ్డి అన్నారు.
అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం మాట్లాడుతూ.. వేరే పార్టీ బీ ఫామ్లపై గెలిచిన ఎమ్మెల్యేలను అవినీతి సొమ్ముతో కొంటున్నారని మండిపడ్డారు. ప్రజల దగ్గరకు వెళితే ఎవరేంటో తెలుస్తుందని ఆయన సవాల్ విసిరారు.
చంద్రబాబుకు తన పాలన మీద తనకే నమ్మకం లేదనిపిస్తోందని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయించడం లేదని వైయస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ఇక నవ నిర్మాణ దీక్ష పేరుతో ఆయన ప్రజలను హేళన చేస్తున్నారని విమర్శించారు.
అవినీతి రహిత రాష్ట్రమని చెబుతున్న చంద్రబాబు.. నిండా అవినీతిలో మునిపోయారని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్ల కేసు భయంతోనే తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజక్టుల గురించి చంద్రబాబు మాట్లాడటం లేదని వైఎస్ జగన్ విమర్శించారు.
సీబీఐ విచారణ జరుపుతుందేమోననే భయంతో అక్రమ ప్రాజెక్టుల విషయంలోనూ ప్రధాని మోడీని కూడా నిలదీయలేకపోతున్నారన్నారు. అందువల్లే కేంద్రం రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
ఇది ఇలా ఉండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు నవనిర్మాణ దీక్ష పేరుతో చేపట్టిన కార్యక్రమం సందర్భంగా ఆయన కుటుంబసభ్యులైనా ప్రతిజ్ఞ చేశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఓ దివాలాకోరు ముఖ్యమంత్రిగా మిగిలిపోతారని మండిపడ్డారు. టిడిపి, బిజెపి ప్రభుత్వాలు ఏపీకి అన్యాయమే చేస్తున్నాయని అన్నారు.