జగన్ సంచలన నిర్ణయం, అక్కడే తేల్చుకుందాం..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం మాజీ సీఎం జగన్ లక్ష్యంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఇదే సమయంలో జగన్ సైతం కౌంటర్ గా కూటమి ప్రభుత్వం పైన పోరుబాట ప్రారంభించారు. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక.. జనంలోనే ఉంటూ పోరాటాలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందు కోసం ఈ నెల 10వ తేదీ నుంచి కొత్త కార్యాచరణ ఖరారు చేసారు. తాను నిరసనల్లో పాల్గొంటానని మరోసారి స్పష్టం చేసారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. మెడికల్ కాలేజీల పై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరుబాట ఖరారు చేసారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని జగన్ నిర్దేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 10 నుంచి 22వ తేదీ వరకు రచ్చబండ కోసం ప్లాన్ చేసారు. కోటి సంతకాల సేకరణ కు నిర్ణయించింది.

నియోజకవర్గం, జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అక్టోబర్ 10 నుంచి 22 వరకు రచ్చబండ కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో 28న నిరసన ర్యాలీలు చేపట్టనుంది. జిల్లా కేంద్రాలలో నవంబర్ 12న ధర్నాలు చేసేందుకు నిర్ణయించారు. తాను ఆ ధర్నాలో పాల్గొంటానని జగన్ ప్రకటించారు.
ప్రతీ నియోజకవర్గం కేంద్రం నుంచి 50 వేల సంతకాలు సేకరణ చేయనున్నారు. నవంబర్ 26న పార్టీ నేతలు గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు లక్ష్యంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు ప్రభుత్వం పైన ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా రెండేళ్లు కావస్తుందని.. ప్రజలకు భ్రమలు తొలిగిపోయాయన్నారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేయటంతో పాటుగా అరాచకం, అవినీతి కనిపిస్తున్నాయని విమర్శించారు. సీఎం చంద్రబాబుకు పాలన పైన ధ్యాస లేదని.. పూర్తిగా పాలన గాడి తప్పిందని ఆరోపించారు. సొంత ఆదాయం కోసమే ధ్యాస పెట్టారని మండిపడ్డారు. అవినీతి విచ్చలవిడిగా మారిందన్నారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం తగ్గిందని చెప్పారు.
చంద్రబాబు..ఆయన బినామీలు వారి జేబుల్లోకి ఆదాయాలు వెళ్తున్నాయని జగన్ విమర్శించారు. దోచుకో.. పంచుకో..తినుకో అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో మళ్లీ లిక్కర్ మాఫియా నడుస్తోందన్నారు. దీని కోసం ప్రభుత్వ దుకాణాలను మూసేసారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 5 లక్షల మంది విద్యార్ధులు తగ్గిపోయారని చెప్పారు. తాను ఈ నెల 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శిస్తానని జగన్ చెప్పుకొచ్చారు. అమరావతిలో ఇప్పుడు మౌలిక వసతులకే రెండు లక్షల కోట్లు అవుతుందని చెబుతున్నారని వివరించారు. రైతుల్లోనూ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగిందని చెప్పుకొచ్చారు. ప్రజల తరపున నిలబడి.. ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేలా కార్యక్రమాలు నిర్వహించాలని జగన్ నిర్దేశించారు.












Click it and Unblock the Notifications