స్థానికంలో ఏకగ్రీవాలు జరిగితే నియోజకవర్గ ఇన్ ఛార్జీకి టికెట్ ఇవ్వను- ఆషామాషీగా తీసుకోవద్దు: జగన్
స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా గనుక జరిగితే కూటమికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని అన్నారు. ఇవి గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావని, కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలని అభివర్ణించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆషామాషీగా తీసుకోవద్దని అన్నారు.
మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను నిలబెడతామని అన్నారు. గతంలో ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జెడ్పీ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు చూశామని, అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా నాయకుడు తనతోనే ఉన్నాడనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలని అన్నారు.

ఇప్పుడు కార్యకర్తకు అండగా నిలబడితేనే, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తారని జగన్ తెలిపారు. స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటన ఒకరకంగా తమకు అనుకూలమేనని వ్యాఖ్యానించారు. అందుకే బలమైన అభ్యర్థులను నిలబెడతామని, ప్రధాన పదవికి బలమైన అభ్యర్థి ఉంటే మిగిలిన ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, వార్డు అభ్యర్థులకు పర్యవేక్షణతోపాటు బలం లభిస్తుందని పేర్కొన్నారు.
ఏ నియోజకవర్గంలోనూ పోటీ లేకుండా ఏకగ్రీవాలకు ఆస్కారం ఉండకూడదని జగన్ దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే సంబంధిత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం కోఆర్డినేటర్ పార్టీ అభ్యర్థులు కాలేరనీ ఆయన స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అభ్యర్థులను నిలబెట్టారో ఎన్నికల అనంతరం నివేదికలు తెప్పించుకుంటానని, ఎమ్మెల్యే అభ్యర్థులు వారి విజయం కోసం ఎంత మేర కష్టపడ్డాడనేది తెలుసుకుంటానని అన్నారు.

కార్యకర్తల కోసం జరిగే ఈ ఎన్నికల్లో మనం గట్టిగా నిలబడితేనే అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలు మన కోసం పని చేస్తారని జగన్ వ్యాఖ్యానించారు. వెన్నుపోటు పార్టీ-వెన్నుపోటు పాలనపై గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాలు ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలని ఆయన సూచించారు. ప్రతి కార్యకర్త కూడా ఇంటింటికీ వెళ్లి తమ పాలన, కూటమి పాలనకు మధ్య తేడాను వివరించాలని, ఇంటింటి ప్రచారానికి అవసరమైన పూర్తి సమాచారాన్ని, ప్రచార సామగ్రిని పార్టీ అందిస్తుందని పేర్కొన్నారు.
పార్టీ కేడర్ కోసం దాదాపు 14- 15 లక్షల గుర్తింపు కార్డులు సిద్ధమయ్యాయని జగన్ తెలిపారు. గ్రామస్థాయి కమిటీలు, అనుబంధ విభాగాల కార్యకర్తల వరకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తామని,. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయుల్లో సమావేశాలు నిర్వహించి గుర్తింపు కార్డులు అందించాలని సూచించారు. సమావేశాల్లో గుర్తింపు కార్డులతోపాటు ఇంటింటి ప్రచార సామగ్రినీ కేడర్కు పంపిణీ చేయాలని చెప్పారు. గుర్తింపు కార్డుల్లో క్యూఆర్ కోడ్ ఉంటుందని, కార్యకర్తలు తమ ఫోన్ లోనే తగిన సమాచారాన్ని పొందవచ్చని వివరించారు.
ప్రతి నియోజకవర్గంలో సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, చురుగ్గా ఉన్నవారిని గుర్తించి, మిగిలిన వారినీ యాక్టివేట్ చేయాలని సూచించారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికలపైకి మొత్తం పార్టీ కేడర్ను తీసుకురావాలని, సోషల్ మీడియా ఖాతాలు ఎలా ప్రారంభించాలి, ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా నిర్వహించాలనే అంశాలపై శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. జగన్ 2.0 సూపర్ యాప్, వైఎస్ఆర్సీపీ టాక్స్, పార్టీ సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజల్లోకి సందేశం తీసుకెళ్లాలని అన్నారు.













Click it and Unblock the Notifications