షర్మిలతోనే జగన్ కు పొంచి ఉన్న ముప్పు!!
ఏపీలో ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో ధర్నా చేస్తున్న సోదరుడు వైఎస్ జగన్ ను టార్గెట్ చేశారు. జగన్ ప్రతిపక్ష హోద కావాలని హై కోర్టుకి వెళ్ళాడని, కానీ ప్రతిపక్ష హోదా కావాలి అంటే అసెంబ్లీ కి వెళ్ళాలి అంటూ హితవు పలికారు. అసెంబ్లీ కి వెళ్లకుండా డిల్లీలో సొంత పార్టీ నీ నిలబెట్టుకునేందుకు ధర్నా చేస్తున్నాడు అని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేసి స్వలాభం కోసం ఢిల్లీ లో ధర్నా చేస్తున్నారన్నారు.
జగన్ ధర్నాపై చెల్లెలి సూటి ప్రశ్నలు
వైసీపీ మనుగడ కోసం డిల్లీలో ధర్నా చేస్తున్నారని విమర్శించిన షర్మిల రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ ఢిల్లీ లో ఎప్పుడైనా ధర్నా చేశాడా అంటూ ప్రశ్నించారు. పోలవరం కోసం ధర్నా చేశాడా.. ప్రత్యేక హోదా కోసం ధర్నా చేశాడా.. కడప స్టీల్ కోసం ధర్నా చేశాడా.. ప్రజల పక్షాన,రైతుల పక్షాన నిలబడి ఎప్పుడైనా ధర్నా చేశాడా అని ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలబడింది కాంగ్రెస్ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు.

జగన్ కు షర్మిలతోనే ప్రమాదం
గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని మండిపడ్డారు. జలయజ్ఞం ద్వారా ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదన్నారు. ఎక్కడకు వెళ్ళినా, ఏ సందర్భంలో అయినా జగన్ ను షర్మిల టార్గెట్ చేస్తున్న తీరు, ప్రజా క్షేత్రంలోకి వెళ్తూ పార్టీ ని షర్మిల బలోపేతం చెయ్యాలని చేస్తున్న ప్రయత్నాలు వెరసి షర్మిలతో జగన్ కు ముప్పు పొంచి ఉందని, బాబు కంటే షర్మిలనే డేంజర్ అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
వరద ముంపు ప్రాంతాల్లో వైఎస్ షర్మిల పర్యటన
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో షర్మిల పర్యటించారు. నడుం లోతు నీళ్ళలో తిరుగుతూ నీట మునిగిన పంటలను పరిశీలించారు. దాదాపు 40 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఎకరానికి 15వేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబుకు రుణ మాఫీపై షర్మిల డిమాండ్
ఇప్పటికే రైతులు అప్పుల్లో ఉన్నారన్న షర్మిల రైతులు మునిగిపోయిన పంట చూసి కన్నీళ్లు పెట్టుకున్నారన్నారు. వాళ్ళ కష్టాలు చూశానని పేర్కొన్న షర్మిల రైతుల కష్టాల్లో కాంగ్రెస్ పాలు పంచుకుంటుంది అన్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఉంటే 2లక్షల రుణమాఫీ చేసి ఉండేదని ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలన్నారు. చంద్రబాబు కూడా 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీపైనా షర్మిల ఆగ్రహం
ఇప్పటి కూటమి ప్రభుత్వం వెంటనే కళ్లు తెరిచి నష్టాన్ని అంచనా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నీ డిమాండ్ చేస్తున్నాం అని పేర్కొన్న షర్మిల మీకు ఎందుకు ఏపీ అంటే నిర్లక్ష్యం అంటూ ప్రశ్నించారు. బీహార్ కి వరద సహాయం కింద నిధులు ఇచ్చారు కానీ ఏపీ కి ఎందుకు నిధులు ఇవ్వలేదని నిలదీశారు. చంద్రబాబు లక్ష కోట్లు అడిగితే మీరు ఇచ్చింది 15 వేల కోట్లు మాత్రమేనని విమర్శించారు.












Click it and Unblock the Notifications