తెలంగాణ షర్మిల బాధ్యత: జగన్ 'హీరో' కథ, తెరాస ఔట్!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం పైన దృష్టి సారించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత... నిన్న మొన్నటి వరకు జగన్ తెలంగాణ పైన దృష్టి సారించడం లేదనే వాదనలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఏపీతో పాటు తెలంగాణలోను పట్టు సాధించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం జగన్ పార్టీకి చెందిన తెలంగాణ నేతలతో సమావేశమయ్యారు.
తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. అదే సమయంలో తెలంగాణలో తన సోదరి పరామర్శ యాత్ర చేస్తారని చెప్పారు. తద్వారా జగన్ తన సోదరికి తెలంగాణ బాధ్యతలను అప్పగించినట్లుగా చెప్పవచ్చు. తెలంగాణ బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తారనే ప్రచారం ఎన్నికలకు ముందే జరిగింది. ఇప్పుడు ఆమె తెలంగాణలో యాత్ర చేయనున్నారు.
తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగా లేదని తెలంగాణ ప్రాంత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం నేతలను, కార్యకర్తలను, నాయకులను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం జగన్ 'హీరో' కథ చెప్పి తెలంగాణ నేతలకు ధైర్యం చెప్పే ప్రయత్నాలు చేశారు.

సినిమాలో హీరో 14వ రీలు వరకు అష్టకష్టాలు పడతాడని, అప్పటి వరకు విలన్దే పైచేయి అవుతుందని, కానీ 15వ రీలు దగ్గరకు వచ్చేసరికే కథ మొత్తం మారుతుందని, అప్పుడు హీరో ఒక్కడే అయినా కథ మొత్తం మార్చేస్తాడని ధైర్య వచనాలు పలికారు.
తద్వారా.. తెలంగాణలో పార్టీ పరిస్థితి ఇప్పుడు ఆశించినంతగా లేనప్పటికీ ముందు ముందు పుంజుకుంటామనే ఉద్దేశ్యంలో జగన్ 'హీరో' కథ చెప్పారని భావించవచ్చు. 2019 నాటికి అధికారంలో మనమే ఉండాలని జగన్ తెలంగాణ నేతలతో అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. వైయస్ స్వర్ణయుగం తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.
కొమరం భీంను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఉంటుందా, ఉండదా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, కానీ యుద్ధం చేయాలంటే గుండెల్లో ధైర్యం కావాలన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడని, మనసు మంచిదైతే ప్రజలు నమ్ముతారని, ఖలేజా ఉంటే, దమ్ము, ధైర్యం ఉంటే ప్రజలే ఆశీర్వదిస్తారన్నారు.
నిజాయితీతో ప్రజల చెంతకు వెళ్దామన్నారు. సోనియాది మన రాష్ట్రం కాదని, అయినా ఇక్కడకాంగ్రెస్ పార్టీ ఉండాలని పట్టుబడుతున్నారని, ఆమెది మన భాష కాదు, మన రాష్ట్రం కాదని, అలాగే బీజేపీ కూడా బలపడేందుకు ప్రయత్నిస్తోందని, నరేంద్ర మోడీకి తెలుగు కూడా రాదన్నారు.
తెలుగు భాష రానివాళ్ళే ఇక్కడ పరిపాలన చేయాలనుకున్నప్పుడు ఇక్కడే పుట్టి, ఇక్కడ ఇన్నాళ్లుగా ఉండి, ఇక్కడి సమస్యలు తెలిసి.. ఇక్కడి వాళ్లకు మంచి చేయాలనుకునే ఒక తెలుగు పార్టీ ఎందుకు రాకూడదన్నారు. ఇప్పుడు తెరాస అధికారంలో ఉందని, నాలుగేళ్లలో ఈ ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోయే రోజు వస్తుందన్నారు.
కొంతముందు, వెనుక.. ఏపీలో చంద్రబాబు పాలన పైన, తెలంగాణలో కేసీఆర్ పాలన పైన వ్యతిరేకత వస్తుందని, నాలుగేళ్ల తర్వాత తెరాస, టీడీపీ వెళ్లిపోతాయని, ఆ తర్వాత మిగిలేది కాంగ్రెస్, బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలే అన్నారు. ఇప్పుడు బలం తక్కువగా ఉన్నా భవిష్యత్తు మనదే అన్నారు.
సోనియాను వ్యతిరేకించి పోరాడింది తాను, తన అమ్మ మాత్రమే అన్నారు. ఆ రోజు తమ వెనుక ఎవరు లేరని, ఆ తర్వాత మీరే మమ్మల్ని ముందుకు నడిపించారని, అలాగే, తెలంగాణలోను ఇలాంటి మంచిరోజులు వస్తాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే రోజు వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications