పవన్ కళ్యాణ్ సవాళ్లు: పట్టించుకోని వైయస్ జగన్
హైదరాబాద్: సీమాంధ్రలో ప్రచారానికి సోమవారం సాయంత్రం తెర పడింది. ప్రచారంలో ప్రత్యర్థులు మాటల ఈటెలు దూసుకున్నారు. తెలుగుదేశం, బిజెపిలకు మద్దతుగా ప్రచారంలోకి దిగిన జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని రక్తి కట్టించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావును హెచ్చరిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మాటల ఈటెలు విసిరారు. జగన్కు సీమాంధ్ర పౌరుషం లేదని, ఆయనలో పౌరుషం చచ్చిపోయిందని పవన్ కళ్యాణ్ అన్నారు.
అవినీతికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ జగన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను సినిమా తీయాలంటూ హెచ్చరించే ధోరణిలో చెప్పారని కూడా ఆయన వెల్లడించారు. రాష్ట్ర విభజనకు వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్ కారణమని ఆయన నిందించారు. జగన్ పదవీ కాంక్ష వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో అన్నారు. ఈ వ్యాఖ్యపై మాత్రమే జగన్ స్పందించారు. అది కూడా పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా ఆయన ఆ విమర్శను తిప్పికొట్టారు. అంతకు మించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆయన స్పందించలేదు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని మాత్రమే ప్రధానంగా ఆయన లక్ష్యం చేసుకున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై కొద్దిగా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ను పట్టించుకోకూడదనే ఉద్దేశంతోనే జగన్ సమాధానం ఇవ్వలేదని అంటున్నారు. సమాధానం ఇస్తే పవన్ కళ్యాణ్ను గుర్తించినట్లవుతుందని, అలా గుర్తించకపోవడమే మంచిదని ఆయన భావించినట్లు చెబుతున్నారు.
అయితే, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైయస్సార్ కాంగ్రెసు పూర్తిగా విస్మరించలేదు. వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఇతర పార్టీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్పై విమర్శలు చేశారు. వాసిరెడ్డి పద్మ వంటి నాయకులు పవన్ కళ్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్కు తిక్క ఉందని, దానికి లెక్క లేదని ఆమె అన్నారు. అంతకు మించిన తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ సోమవారంనాడు తన ఎన్నికల ప్రచార సభలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. తన తిక్కకు లెక్క లేదని అంటున్నారని, తన తిక్కకు ఓ పద్ధతి ఉందని అంటూ వైయస్ జగన్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
పవన్ కళ్యాణ్ ఎంతగా రెచ్చగొట్టాలని చూసినా జగన్ మాత్రం ఆయన పట్ల మౌనమే వహించారు. సీమాంధ్రలో కెసిఆర్పై పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేసినా తెరాస నాయకులు కూడా పెద్దగా పట్టించుకున్నట్లు లేరు. హరీష్ రావు మాత్రమే కొద్ది స్పందించినట్లున్నారు. పవన్ కళ్యాణ్కు సమాధానం ఇస్తే ఆయనను గుర్తించినట్లువుతుందనే ఉద్దేశంతో విస్మరించినట్లు కనిపిస్తున్నారు.