రూటు మార్చిన జగన్ - కీలక సందేశం..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ లో మార్పు కనిపిస్తోంది. ఎన్నికల్లో పరాజయం తరువాత పొరపాట్లను సరిదిద్దుకొనే ప్రయత్నం మొదలైంది. సుదీర్ఘ పాదయాత్రతో ప్రజలు, పార్టీ కేడర్ తో కలిసి ప్రయాణం చేసిన జగన్ 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయిన తరువాత ప్రజలకు..పార్టీ కేడర్ కు దూరమయ్యారు. ఎమ్మెల్యేలు సైతం సీఎం ను కలవలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఫలితాల తరువాత తిరిగి సాధారణ ప్రజలు..పార్టీ కేడర్ కు జగన్ అందుబాటులోకి వచ్చారు.
జగన్ లో మార్పు
ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలో సాధారణ ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రజాదర్భార్ నిర్వహించాలనే ప్రతిపాదన పలు మార్లు ప్రస్తావనకు వచ్చింది. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో ప్రతీ రోజు ఉదయం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించే వారు. అదే తరహాలో జగన్ కొనసాగించాలని పార్టీలో పలువురు సీనియర్లు సూచించారు. కానీ, అమలు కాలేదు. అదే విధంగా వైఎస్సార్ తన పాలన ..పథకాల పైన ప్రజల్లోకి వెళ్లేందుకు రచ్చబండకు నిర్ణయించారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తేనే హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు.

కేడర్ కోసం సమయం
జగన్ తాను అమలు చేసిన సంక్షేమ పథకాల పైన ప్రజల నుంచే ఫీడ్ బ్యాక్ తీసుకొనేందుకు రచ్చబండ నిర్వహిస్తానని అంతర్గత చర్చల్లో పేర్కొన్నారు. అయిదేళ్ల కాలంలో ఒక్కసారి రచ్చబండ నిర్వహించ లేదు. ఇక...ఎమ్మెల్యేలు సైతం క్యాంపు కార్యాలయానికి వెళ్లినా సీఎంతో నేరుగా కలవాలంటే కష్టతరమైందని పలువురు ఫలితాల తరువాత చెబుతూ వస్తున్నారు. సీఎంగా మీడియా సమావేశాలు నిర్వహించని జగన్ ఇప్పుడు ఈ నెలన్నార కాలంలో అయిదు సార్లు మీడియా సమావేశాలు నిర్వహించారు. ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ప్రజలతో మమేకం
తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జగన్ ప్రజలు, పార్టీ కేడర్, అభిమానులను కలిసేందుకు సమయం కేటాయించారు. పలువురు తాడేపల్లిలో జగన్ నివాసానికి చేరుకున్నారు. వారిని జగన్ పలకరించారు. ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైయస్ జగన్ గారు భరోసానిచ్చారు.












Click it and Unblock the Notifications