ఫలితాలు చూసి వెళ్లిపోదామనుకున్నా, కానీ - జగన్ వ్యాఖ్యలు..!!
ఎన్నికల ఫలితాలు వైసీపీకి షాక్ ఇచ్చాయి. కేవలం 11 స్థానాలకే పరిమితం కావటంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అంతు చిక్కటం లేదు. తాను మంచి చేసానని..అయినా ఫలితం ఇలా రావటం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జగన్ బెంగళూరు పర్యటనలో ఉన్నారు. ఫలితాల తరువాత తాను ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నానో పార్టీ నేతలకు వివరించారు. ఆ సమయంలోనే జగన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చకు కారణమయ్యాయి.
హిమాలయాలకు వెళ్దామనుకున్నా
ఎన్నికల ఫలితాల షాక్ నుంచి జగన్ కోలుకోలేదు. తనను కలిసిన పార్టీ నేతల వద్ద ఫలితాల గురించి చర్చిస్తున్నారు. తాను ఫలితాలు చూసి షాక్ అయ్యానని జగన్ చెప్పుకొచ్చారు. ఇంత చేస్తే ఈ ఫలితం ఏంటని వ్యాఖ్యానించారు. అసలు..అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించిందని జగన్ పార్టీ నేతలతో పేర్కొన్నారు. ఫలితాల షాక్ లో నుంచి బయటకు రావటానికి రెండు మూడు రోజుల పైనే పట్టిందని పార్టీ నేతలకు వివరించారు. నిజంగా వెళ్లిపోదామనే అనిపించిందన్నారు. కానీ, వచ్చిన ఓట్ల గురించి కీలక వ్యాఖ్యలు చేసారు.

40 శాతం ఓట్లు వచ్చాయి
ఎన్నికల్లో సీట్లు రాకపోయినా 40 శాతం ఓట్లు మన పార్టీకి వచ్చాయని జగన్ పేర్కొన్నారు. దీని ద్వారా అంత పెద్ద సంఖ్యలో జనం మన పట్ల నమ్మకాన్ని పెట్టుకున్నారని... అది చూశాకనే మనం నిలబడాలని.. మనకు ఓట్లు వేసిన జనం కోసం పని చేయాలనిపించిందని జగన్ చెప్పుకొచ్చారు. దీంతో మెల్లగా ఫలితాల నుంచి బయటికొచ్చానని చెప్పారు. ఆ ఫలితాలు ఎందుకు అలా వచ్చాయనేందుకు అనుమానాలు, కారణాలు ఏవి ఉన్నా, మనకు ఓట్లు వేసిన జనం కోసం ముందు నిలబడాలని పార్టీ నేతలకు జగన్ సూచించారు. సర్వేలు చేయించామని..వాటిలో ఎక్కడా వ్యతిరేకత రాలేదన్నారు.
అండగా నిలబడాలి
ఆ సర్వేలతోనే కాన్ఫిడెంట్గా ఉన్నామని.. కానీ, ఫలితాలు ఇంకోలా వచ్చాయని జగన్ విశ్లేషించారు. వాటిని చూసినపుడు తన పరిస్థితే ఇలా ఉంటే, క్షేత్రస్థాయిలో మీకూ ఇబ్బందిగానే ఉంటుందని పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. వారి పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనన్నారు. తాను బయటికొచ్చినట్లే పార్టీ నేతలూ ఎన్నికల ఫలితాల నుంచి బయటకు రావాలని సూచించారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే కార్యక్రమాలకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు జగన్ నిర్దేశించారు. వచ్చే వారం పార్టీ అనుబంధ విభాగాలతో జగన్ సమావేశం కానున్నారు.












Click it and Unblock the Notifications