విశాఖలో భయానకం, హోదా అడిగితే అరెస్టులా?: బాబును ఏకేసిన జగన్
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన.. జాతీయజెండాను ఎగురవేశారు. అనంతరం తెలుగు ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రానంతరం చట్టాలను సవరించుకుని రిపబ్లిక్ కంట్రీగా అవతరించిందన్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో ప్రజాస్వామ్యంలో ఉందా.. లేక బ్రిటిష్ పాలనలో ఉన్నామా అని ఆయన ప్రశ్నించారు.
68 ఏళ్ల క్రితం మనం రాసుకున్న చట్టాలు ఇప్పుడు అమలు అవుతున్నాయా? అని నిలదీశారు.
ప్రత్యేక హోదా కోసం గళమెత్తిన యువతను, పార్టీ నేతలను హౌస్ అరెస్ట్లు చేస్తున్నారని మండిపడ్డారు. పాలకులు రూల్స్ బ్రేక్ చేయడం బాధాకరమన్నారు. విశాఖ ఆర్కే బీచ్ పరిసరాల్లో ఆంక్షలు విధించడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనీసం వాకర్స్ను కూడా బీచ్ పరిసరాల్లోకి అనుమతించడంలేదన్నారు. విశాఖలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నారు.

పార్లమెంటు సాక్షిగా..
పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామన్నారు. ఎంపీ మిథున్రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నేతలను హౌస్ అరెస్ట్లు చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా...సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారన్నారు.

హోదాను నీరుగారుస్తున్నారు..
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ రాసిన చట్టాలనే అపహాస్యం చేస్తున్నారన్నారు. దళితుల భూములను అక్రమంగా లాక్కుంటున్నారని ఆక్షేపించారు. పట్టా భూములకు 1400 గజాలు, బీసీ, దళితుల భూములకు వెయ్యి గజాలు ఇస్తూ వివక్ష చూపుతున్నారన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని నీరుగారుస్తున్నారన్నారు. పార్లమెంట్లో ఇచ్చిన హామీలకే దిక్కులేకుండా పోయిందన్నారు.

కాలర్ పట్టుకోవాలి...
ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. ఫ్లెక్సీలు, టీవీల్లో గోడలపై జాబు రావాలంటే బాబు రావాలని ప్రచారం చేశారన్నారు. ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఐదున్నర కోట్ల ప్రజలను బాబు వెన్నుపోటు పొడిచారన్నారు. అబద్ధాలు చెప్పే నేతల కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తే మార్పు వస్తుందన్నారు.

ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారు..
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయమన్నందుకు కాపు నేత ముద్రగడ, ఆయన కుటుంబసభ్యులను ఏ విధంగా హింసించారో మనం చూశామన్నారు. పార్టీ మారాలనుకున్న ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయాలన్నారు. కానీ చంద్రబాబు దగ్గరుండి ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 నుంచి 30 కోట్లోచ్చి కొనుగోలు చేశారన్నారు. ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయిన చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications