రూ.1000 కోట్లతో కొత్తగా: గ్రామ సచివాలయాల్లోనే భూముల రిజిస్ట్రేషన్: వైఎస్ జగన్
అమరావతి: సమగ్ర భూసర్వే పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరి భూమిని సమగ్ర, ఆధునిక పద్ధతుల్లో రీసర్వే చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. వైఎస్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పేరుతో దీన్ని అమలులోకి తీసుకొచ్చింది. దీనితోపాటు పాటు యూనిక్ నంబర్ను ఇవ్వడం, భూమికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, డేటా మొత్తాన్ని సబ్ డివిజన్ కార్యాలయాలతో అనుసంధానించడం దీని ఉద్దేశం. ఈ తరహా భూసర్వే చేపట్టడం దేశంలోనే ఇదే తొలిసారి.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో..
శాస్త్రీయ పద్ధతుల్లో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సమగ్ర భూసర్వేను చేపట్టామని, తొలి దశలో 51 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని పూర్తి చేశామని అన్నారు. 37 గ్రామ సచివాలయాల పరిధిలో ఇవ్వాళ్టి నుంచి భూములు, స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ చేసే మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. మిగిలిన 14 గ్రామాల్లో రాబోయే మూడు వారాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి 37 గ్రామాల సచివాలయాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించారు.

ఏ వ్యవస్థా లేదు..
వివాదాలకు అవకాశం లేకుండా రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ను చేయించుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని వైఎస్ జగన్ అన్నారు. దేశంలో 100 సంవత్సరాల కిందట బ్రిటీషర్ల హయాంలో భూముల సమగ్ర సర్వే చేపట్టారని, ఆ తరువాత జమాబందీ విధానంలో 1983 వరకు భూములకు సంబంధించిన అభ్యంతరాలు పరిష్కరించేవారని పేర్కొన్నారు. 1983 తరువాత కరణాల వ్యవస్థ రద్దుకావడంతో మరో వ్యవస్థ ఏర్పాటుకాకపోవడంతో అంతవరకు జరిగిన జమాబంధీ విధానం కూడా ఆగిపోయిందని అన్నారు.

మన భూమిని మనకు తెలియకుండానే.. వేరే వారి పేరు మీద
భూములకు సంబంధించిన రికార్డులు కూడా ట్యాంపరింగ్ జరుగుతోందని, మన భూమిని మనకు తెలియకుండా..వేరేవారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఈ ట్యాంపరింగ్ ఉంటోందని అన్నారు. రిజిస్ట్రేషన్లో ఒక రకంగా, భూమి దగ్గరకు వెళ్లి కొలతలు వేస్తే మరో రకంగా భూములు ఉండే ఇలాంటి వివాదాలు పరిష్కరించడానికే భూసర్వే చేయిస్తున్నామని వైఎస్ జగన్ చెప్పారు. భూములకు సంబంధించిన హద్దులు, శాశ్వతమైన హక్కులు రెండూ కూడా లేకపోవడం వల్ల రికార్డుల్లో తమ భూముల వివరాలు తారుమారయ్యాయనే ఫిర్యాదులు విపరీతంగా పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు.

భూముల రీ సర్వే..
2020 డిసెంబర్ 21వ తేదీన భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టామని, డ్రోన్స్ టెక్నాలజీతో మొత్తం 50 అంశాలలో 10,158 మందికి సర్వేలో శిక్షణ ఇచ్చామని, దీనికోసం 1,000 కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్నామని అన్నారు. 4,500 సర్వే బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు. 2,000 రోవర్స్, 70 కోర్స్బేస్ స్టేషన్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా తొలిదశలో 51 గ్రామాల్లో 12,776 మంది భూ యజమానులకు, 21,404 భూకమతాలకు సంబంధించిన 29,563 ఎకరాల భూముల రీసర్వే పూర్తి చేశామని అన్నారు.

శాశ్వత భూహక్కు
శాశ్వత భూహక్కు ఇవ్వడం, హద్దులను మార్కింగ్ చేయడం, మ్యాపులు ఇవ్వడం, ప్రత్యేకంగా యూనిక్ ఐడీ నంబర్, క్యూఆర్ కోడ్లో వాటి వివరాలను భద్రపర్చడమే కాకుండా పర్మినెంట్ టైటిల్స్తో భూముల రికార్డులు వాటి యజమానుల చేతుల్లో పెట్టబోతున్నామని వైఎస్ జగన్ అన్నారు. సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల, ట్యాంపరింగ్, ఇతరత్రా లోపాల వల్ల స్థిరాస్తులు చేజారిపోయే పరిస్థితి ఎవరికైనా వస్తే బాధాకరమని, ఈ తరహా వివాదాలకు ముగింపు పలకడానికే భూములన్నీ కొలతలు వేసి.. ఐడెంటిఫికేషన్ నంబర్ కూడా ఇస్తామని అన్నారు. శాశ్వత హక్కులను సరిహద్దు రాళ్లు కూడా పాతి మరీ ఇవ్వగలిగితే భూములపై లిటిగేషన్ ఉండదని అన్నారు.












Click it and Unblock the Notifications