జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం-శ్రీకారం చుట్టిన జగన్-విపక్షాలపై ఫైర్
ఏపీలో నిరుపేదల సొంత ఇంటి కల సాకారం చేసే దిశగా ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఒకేసారి 30.76 లక్షల మంది అర్హులైన పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటిలో ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది. జగనన్నకాలనీల పేరుతో నిర్మిస్తున్న ఈ ఇళ్ల పనుల్ని ఇవాళ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఇళ్ళ పట్టా పొందిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ చేయూతతో సొంత ఇంటిని నిర్మించుకునేందుకు పక్కాగృహాలను ఇందులో మంజూరు చేసింది. తొలి విడతలో మొత్తం 15,60,227 గృహాల నిర్మాణంకు సర్కారు శ్రీకారం చుట్టింది.

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం
ఏపీలో పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వం వాటిలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఇవాళ తొలి అడుగు వేసింది. ఇందులో భాగంగా రెండు దశల్లో పేదల కోసం రూ.50,944 కోట్లతో మొత్తం 28,30,227 పక్కాగృహాలను నిర్మించే కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. క్యాంపు కార్యాలయం నుంచే తొలివిడత కాలనీల్లో నిర్మాణాల పనుల్ని ప్రారంభించారు. తొలి విడతలో 15.60 ఇళ్ళు, రెండో విడతలో రూ.22,860 కోట్లతో 12.70 లక్షల ఇళ్ళను నిర్మించనుంది. మొదటి దశ ఇళ్ల నిర్మాణం జూన్ 2022 నాటికి, రెండో దశ ఇళ్ళ నిర్మాణాన్ని జూన్ 2023 నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. మొదటి దశ ఇళ్ళ నిర్మాణంలో 8,905 లేఅవుట్లలో 11.26 లక్షల ఇళ్ళను వైయస్ఆర్ జగనన్న కాలనీలుగా నిర్మిస్తున్నారు.

భారీ ఎత్తున మౌలిక సదుపాయాలు
జగనన్న కాలనీల్లో భాగంగా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంతో పాటు భారీ ఎత్తున మౌలిక సదుపాయాల్ని సైతం అభివృద్ధి చేయబోతోంది. ఇందులో భాగంగా కొత్తగా చేపట్టే గృహనిర్మాణ ప్రాంతాల్లో రూ.32,909 కోట్లను ఖర్చు చేస్తోంది. తాగునీటి కోసం .4,128 కోట్లు, రోడ్లు, డ్రైనేజీ కోసం రూ.22,587 కోట్లు, విద్యుత్ సరఫరా కోసం రూ.4,986 కోట్లు, ఇంటర్నెట్ కోసం రూ.627 కోట్లు, ఇతర సౌకర్యాల కోసం రూ.567 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
అన్ని వసతులతో కూడిన ఇళ్ళు
వైయస్ఆర్ జగనన్న కాలనీలు అన్ని హంగులతో... అందంగా తీర్చిదిద్దడమే కాకుండా... పేదలకు మంజూరు చేసిన ప్రతి ఇల్లు అన్ని సదుపాయాలతో ఉండాలని సీఎం ఆదేశించారు.

ఇళ్ల నిర్మాణంతో కరోనాలో ఉపాధి
రాష్ట్రంలో భారీ ఎత్తున చేపడుతున్న జగనన్న కాలనీల నిర్మాణంతో ఆర్థిక పరిస్థితికి, గృహనిర్మాణంతో ఊతం లభించబోతోంది.
కోవిడ్-19 రెండోదశ కారణంగా రాష్ట్రంలో అర్థిక పరిస్థితి కుదేలైన సమయంలో... పనులు లేక నిస్తేజంతో ఉన్న వివిధ రంగాలకు చెందిన కార్మికులకు, కూలీలకు గృహనిర్మాణం ఊతం ఇవ్వబోతోంది. మొదటిదశ ఇళ్ళ నిర్మాణం ద్వారా 21.70 కోట్ల పనిదినాల ఉపాధి కూలీలకు లభించబోతోంది. అలాగే పెద్ద ఎత్తున ప్రారంభమవుతున్న నిర్మాణ పనులతో తాపీ మేస్ట్రీలు, రాడ్ వెండర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇటుకల తయారీదారులు, సిమెంట్ విక్రేతలకు ఉపాధి లభించనుంది.

సరసమైన ధరలకే సామాగ్రి
పేదలు నిర్మించుకునే ఇళ్ళకు వినియోగించే మెటీరియల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మెటీరియల్ సప్లయిదారులతో మాట్లాడి సరసమైన ధరలకే విక్రయించేందుకు కృషి చేసింది. లబ్ధిదారులతో భారం పడకూడదని నాణ్యమైన మెటీరియల్స్ను మార్కెట్ ధరకన్నా తక్కువకే సరఫరా చేసేందుకు రివర్స్ టెండరింగ్ నిర్వహించింది. లబ్ధిదారుల కోసం సిమెంట్, ఇతర మెటీరియల్స్ను నిల్వ చేసుకునేందుకు గ్రామ, మండల స్థాయిలో గోదాములను ఏర్పాటు చేసింది. తొలిదశ నిర్మాణం కోసం 69.70 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్, 7.44 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్, 310 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక, 232.50 కోట్ల సిమెంట్, ఫాల్ జి బ్లాక్స్ను ప్రభుత్వం సేకరిస్తోంది. ప్రతి ఇంటి నిర్మాణానికి 20 మెట్రిక్ టన్నుల ఇసుకను దగ్గరలోని ఇసుక రీచ్ల నుంచి ఉచితంగా ప్రభుత్వం అందించనుంది.

ఇంటి నిర్మాణంలో లబ్ది దారులకు ఆప్షన్లు
గృహనిర్మాణంలో లబ్ధిదారుడికి మూడు ఆప్షన్లు
ఇస్తున్నారు. ఇందులో లబ్ధిదారుడి నిర్ణయానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ళను నిర్ధిష్ట నమూనాలో నిర్మించుకునే విషయంలో లబ్ధిదారుడు సొంతగా నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మూడు ఆప్షన్లను లబ్ధిదారుల ముందు ఉంచింది. దీనిలో...
ఆప్షన్ -1 : ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇళ్లు నిర్మించుకోవటానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వమే సరఫరా చేసి, లేబర్ చార్జీలకు కూడా డబ్బు ఇస్తుంది. లబ్దిదారులే ఇల్లు నిర్మించుకోవచ్చు.
ఆప్షన్ -2 : ఇంటి నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామాగ్రిని లబ్దిదారులు తామే తెచ్చుకోవచ్చు.
తమకు నచ్చిన చోట నుండి కొనుక్కొని ఇల్లు నిర్మించుకోవచ్చు. దశల వారీగా వారి పురోగతిని బట్టి ప్రభుత్వం బ్యాంకు ఖాతాలకు చెల్లింపులు చేస్తుంది.
ఆప్షన్ - 3 : లబ్దిదారులు తాము కట్టుకోలేము , ఆ బాధ్యత అంతా ప్రభుత్వమే తీసుకొని కట్టించమంటే, ప్రభుత్వం నిర్దేశించిన నమూనా ప్రకారం ఇల్లు నిర్మించేందుకు అవసరమైన నిర్మాణ సామాగ్రిని సరఫరా చేయడంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు అవసరమైన పూర్తి సహయ సహకారాలు ప్రభుత్వమే అందించి కట్టిస్తుంది.

విపక్షాలపై జగన్ ఫైర్
రాష్ట్రంలో జగనన్న కాలనీల్ని వర్చువల్ విధానంలో ప్రారంభించిన జగన్ ఆ తర్వాత వీటి వివరాలు వెల్లడించారు. అదే సమయంలో విపక్షాలపై ఫైర్ అయ్యారు. 3.74 లక్షల మంది మహిళలకు ఈ రోజు న్యాయం చేయలేక పోతున్నాం. కొంత మంది దుర్బుద్ధితో కోర్టుల్లో కేసులు వేశారు. ఈ కేసులను పరిష్కరించేందుకు కొంత సమయం పడుతుంది. కోర్టులు సెలవుల్లో ఉన్నాయి. కోర్టులు తెరిచిన వెంటనే దీన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుని 3.74 లక్షల మంది మహిళలకు న్యాయం చేస్తామని జగన్ తెలిపారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదవారు ఎక్కడా ఉండకూడదన్నారు. పేదవారి సొంతిళ్లు కల నిజం చేస్తున్నామన్నారు. పండగ వాతావరణంలో ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
-
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట!











Click it and Unblock the Notifications