పల్నాడులో ఐటీసీ స్పైసెస్ ప్లాంట్ ప్రారంభించిన జగన్-1500 ఉద్యోగాలు-14 వేల రైతులకు వరం...
ఏపీలో మరో అంతర్జాతీయ శ్రేణి ప్లాంట్ ప్రారంభమైంది. పల్నాడు జిల్లా యడ్లపాటులో ఐటీసీ నిర్మించిన ప్రపంచ శ్రేణి మసాలా దినుసుల ప్రాసెసింగ్ ప్లాంట్ ను సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు. ఈ ప్లాంట్ నిర్మాణంతో 1500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు రాబోతున్నాయి. అలాగే ఈ ప్రాంతంలో 14 వేల మంది రైతులకు లబ్ది చేకూరబోతోంది. ఇప్పటికే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో టాప్ లో ఉన్న ఏపీకి ఇది మరో వరంగా మారబోతోంది.
పల్నాడులో ఐటీసీ స్పైసెస్ ప్లాంట్
పల్నాడులో ఐటీసీ నిర్మించిన ప్రపంచ శ్రేణి స్పైసెస్ ప్రాసెసింగ్ ప్లాంట్ లో మిరప, పసుపు, మిశ్రమ మసాలా దినుసులు కోసం ప్రాసెసింగ్ లైన్స్ ఉంటాయి. దీని వార్షిక సామర్ధ్యం 20,400 మెట్రిక్ టన్నుల మసాలా దినుసులు.ఈ ప్లాంట్లో సమగ్రమైన ప్రాసెసింగ్ అవసరాలు అయిన స్టోరేజీ, క్లీనింగ్, ప్రాసెసింగ్, స్టెరిలైజేషన్, ప్యాకింగ్, నాణ్యత పరీక్షల సదుపాయాలు ఉంటాయి. ఈ మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ ఫుడ్ సేఫ్టీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఇది ఉత్పత్తులను తయారుచేసి ఎగుమతి కూడా చేస్తుంది.
ప్లాంట్ ఏర్పాటుపై ఐటీసీ ఛైర్మన్
ఏపీలో ఐటీసీ ప్లాంట్ ప్రారంభించడంపై ఐటీసీ లిమిటెడ్ ఛైర్మన్ సంజీవ్ పురి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధలోని మూడు కీలక రంగాలైన వ్యవసాయం, తయారీ, సేవల రంగంలో తమ కార్యకలాపాలను బలోపేతం చేయాలనే నిబద్ధతకు అనుగుణంగా పల్నాడులో ఈ ప్లాంట్ ప్రారంభించామన్నారు. అంతర్జాతీయ ఆహార భద్రతా ప్రమాణాలకనుగుణంగా అత్యున్నత నాణ్యత కలిగిన స్పైసెస్ను అందించడంతో పాటుగా స్థానిక వ్యవసాయ విలువ చైన్కూ తోడ్పాటునందించనున్నట్లు ఆయన తెలిపారు.
సస్టెయినబిలిటీ మరియు ఇన్క్లూజన్కు ప్రతీకగా ఈ యూనిట్ నిలువనుండటంతో పాటు ఈ యూనిట్లోని సమగ్రమైన కార్యక్రమాల ద్వారా రైతుల ఆదాయం మెరుగుపరచడం, మహిళాసాధికారిత వృద్ది చేయడం, పెద్ద మొత్తంలో జీవనోపాధికి మద్దతు అందించడం, పునరుత్పాదక విద్యుత్ను విస్తృతంగా వినియోగించనన్నట్లు సంజీవ్ పురి వెల్లడించారు.
పుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లతో 33 వేల ఉద్యోగాలన్న జగన్
ఈ ప్లాంట్ 200 కోట్ల పెట్టుబడితో ఏటా 20 వేల మెట్రిక్ టన్నుల మిర్చి, సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి ఎగుమతి చేయబోతోందని సీఎం జగన్ తెలిపారు. మిర్చితో పాటు పసుపు, అల్లం, ధనియాలు, యాలకులు వంటి 15 రకాల సేంద్రీయ సుగంధ దినుసుల్ని ప్రాసెస్ చేయబోతున్నారన్నారు. రెండోదశ కూడా మరో 15 నెలల్లో పూర్తవుతుందన్నారు. ఆ తర్వాత దేశంలోనే అతి పెద్ద మసాలా దినుసుల ప్రాసెసింగ్ ప్లాంట్ మన రాష్ట్రంలో ఉండబోతోందని జగన్ తెలిపారు. పనులు ప్రారంభించిన రెండేళ్లలోనే ఈ ప్లాంట్ ప్రారంభమవుతోందన్నారు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన సహకారమే ఇందుకు కారణమని జగన్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా మూడేళ్లుగా దేశంలో ఏపీ నంబర్ వన్ గా ఉందని, పరిశ్రమల్ని సంప్రదించి ఈజ్ ఆఫ్ డూయింగ్ మార్పులు చేస్తున్నామని జగన్ తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో ఫుడ్ ప్లాసెసింగ్ యూనిట్లను ప్రారంభించబోతున్నామని జగన్ తెలిపారు. దీంతో అన్ని జిల్లాల్లో రైతులకు మేలు జరగడమే కాకుండా 33 వేల ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు.