ఆపండి: ప్రణబ్కి వినతులు, మాట్లాడకుండా వెళ్లిన జగన్
హైదరాబాద్: విభజన అంశంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతుల వెల్లువెత్తింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ తదితర నేతలు ప్రణబ్ను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైయస్ జగన్ సోమవారం రాత్రి రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ఆయన రాజ్భవన్లో రాష్ట్రపతితో భేటీ అయ్యారు.
జగన్ మీడియాతో మాట్లాడకుండా నేరుగా వెళ్లిపోగా ఆ పార్టీ నేతలు మైసూరా రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతికి రెండు సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చామని, ఏకపక్ష విభజన వద్దని కోరామని, ఫైలిన్ తుపాను, అల్పపీడన వర్షాల బాధితులను ఆదుకోవాలని విన్నవించామని తెలిపారు. గతంలో ఎస్సార్సీ ద్వారానే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్నారు. విభజనకు శాసనసభ తీర్మానమో, ఎస్సార్సీ సిఫారసు వంటిదో ఉండాలన్నారు.

గతంలో రాష్ట్రాలన్నీ అలాగే ఏర్పడ్డాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పద్ధతి అనుసరించాలన్నారు. రాష్ట్రంలో కనీసం తీర్మానం కూడా లేదని, తాము చెప్పి విషయాలను ప్రణబ్ సావధానంగా విన్నారని, పరిశీలిస్తామని చెప్పారని మైసూరా తెలిపారు. ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలి హోదాలో ఉన్న లక్ష్మీపార్వతి కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలతో పాటు రాజ్ భవన్కు వెళ్లారు. అయితే ఆమె వేరుగా ఆయనను కలిసి వినతి పత్రం ఇచ్చారు. అడ్డగోలు విభజన ఆగాలంటే మీరే దిక్కని రాష్ట్రపతిని కోరినట్లు ఆమె చెప్పారు.
విభజనలో సమన్యాయం లేదని కాబట్టి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని టిడిపి సీమాంధ్ర ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్రపతిని కలిసి కోరారు. కలిసి ఉంటేనే అన్ని ప్రాంతాలకు, వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. విభజన ఇప్పటి వరకు తీసుకున్న చర్యలన్నీ ఉపసంహరించుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు.












Click it and Unblock the Notifications