వైజాగ్ లో జగన్ కీలక ఒప్పందం-సముద్రం నుంచి 76 వేల టన్నుల ప్లాస్టిక్ తొలగింపు-ఏపీలో ప్లాస్టిక్ బ్యాన్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా ప్రతిపాదిస్తున్న వైజాగ్ లో ఇవాళ సీఎం జగన్ కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవాళ ఒక్కరోజు పర్యటనలో భాగంగా విశాఖ వచ్చిన జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో విశాఖ బీచ్ నుంచి భారీ ఎత్తున ప్లాస్టిక్ వ్యర్ధాల్ని తొలగించేందుకు ఉద్దేశించిన కీలక ఒప్పందంపై ఆయన సంతకాలు చేశారు. అలాగే ఏపీలో ప్లాస్టిక్ నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
విశాఖలో జగన్
విశాఖపట్నంలో సీఎం జగన్ ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఒక్కరోజు పర్యటన కోసం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి విశాఖ చేరుకున్న జగన్.. బీచ్ లో వ్యర్ధాల్ని తొలగించే కీలక ప్రాజెక్టు కోసం ఒప్పందం చేసుకున్నారు. అనంతరం మిగతా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సాగర తీరాన్ని పరిరక్షించేందుకు అమెరికాకు చెందిన స్వచ్చంద సంస్ధ పార్లే ఫర్ ది ఓషన్స్తో ఒప్పందం కుదుర్చుకున్న జగన్.. గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దిగ్గజ మైక్రోసాఫ్ట్ సంస్ధ శిక్షణ ఇచ్చిన 5 వేల మందికి ధృవపత్రాలను అందించనున్నారు.
బీచ్ క్లీనింగ్ ఒప్పందం
విశాఖ తీరం నుంచి భీమిలి వరకూ ఉన్న సముద్ర తీరంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్ధాల్ని తొలగించే కీలక ప్రాజెక్టు అమలు కోసం సీఎం జగన్ ఇవాళ పార్లే ఫర్ ద ఓషన్ సంస్ధతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐదేళ్లపాటు నదులు, సముద్రాల్లోని ప్లాస్టిక్ వ్యర్ధాలు తొలగింపు కోసం అడిడాస్ షూ కంపెనీతో పార్లే సంస్థకు ఒప్పందం ఉంది. ఇందులో భాగంగా తొలిసారిగా విశాఖలో రీ సైక్లింగ్ ప్లాస్టిక్ యూనిట్ ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం రూ. 16వేల కోట్ల రూపాయాలను వెచ్చించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్లే ఫర్ ది ఓషన్ సంస్థ గిన్నిస్ రికార్డు కోసం ఇవాళ బీచ్ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపడుతోంది. జీవీఎంసీ, జిల్లా కలెక్టరేట్, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇవాళ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు సాగరతీరాన్ని పరిశుభ్రం చేసింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు సుమారు 28 కిలోమీటర్ల పొడవునా సాగరతీరంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల్ని సేకరించే కార్యక్రమాన్ని చేపట్టింది. మొత్తం 20 వేల మంది వలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్లాస్టిక్ బ్యాన్ ప్రకటించిన జగన్
విశాఖ తీరంలో బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. అనంతరం రాష్ట్రంలో ప్లాస్టిక్ పై నిషేధం దిశగా కీలక ప్రకటనలు చేశారు. ఏపిలో ప్లాస్టిక్ బ్యానర్స్ బ్యాన్ చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. బట్టతో చేసిన బ్యానర్స్ మాత్రమే వాడాలని కోరారు. ఇకపై ప్లెక్సీ లు పెట్టాలి అంటే బట్టతో మాత్రమే చేసినవి పెట్టాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా బట్ట ఫ్లెక్సీల్ని వాడేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు.