భూమా సవాల్తో బిక్కచచ్చిన వైసిపి: జగన్కు గండమే
కర్నూలు: తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన భూమా నాగిరెడ్డి కుటుంబం వల్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి దెబ్బనే తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. కర్నూలులోని మూడు శాసనసభా నియోజకవర్గాల్లో జగన్కు సరైన నాయకులు దొరికే పరిస్థితి లేదు. కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో భూమా నాగిరెడ్డి కుటుంబానిదే ఆధిపత్యం.
నిజానికి, రాయలసీమలోని చాలా నియోజకవర్గాల్లో పార్టీల కన్నా నాయకులే బలవంతులు. సాంకేతికంగా పార్టీ పేర్ల మీద పోటీ జరిగినప్పటికీ నాయకుల వ్యక్తిగత బలాబలాలపైనే విజయం ఆధారపడి ఉంటుంది. ఈ స్థితిలో భూమా నాగిరెడ్డిని ఢీకొట్టి నిలబడగలిగే నాయకులు ఆ మూడు నియోజకవర్గాల్లో వైసిపికి నాయకులు దొరికే పరిస్థితి లేదు.
దాని కారణంగానే భూమా నాగిరెడ్డి విసిరిన సవాల్తో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన నాయకులు బిక్కచచ్చిపోయారని అంటున్నారు. దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, తిరిగి పోటీ చేయించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సవాళ్లు విసురుతూ వచ్చారు. దాంతో భూమా నాగిరెడ్డి వారికి గట్టిగానే సమాధానం చెప్పాలనుకుని ఓ సవాల్ విసిరారు.

వైసిపి నాయకులు విసిరిన సవాల్ను భూమా స్వీకరిస్తూ వారు కోరుకుంటున్నట్టుగానే తానుగానీ తన కూతురు అఖిల ప్రియగానీ బావమరిది ఎస్వీ మోహన్రెడ్డి గానీ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మళ్లీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాము గెలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూసేస్తారా అని భూమా నేరుగా జగన్కే గురి పెట్టి సవాల్ విసిరారు.
నాలుగు దశాబ్దాలుగా భూమా ఎస్వీ కుటుంబాలు రాజకీయాలలో ఉన్నాయి. ఆ కుటుంబాలపై ఎవరు కూడా అవినీతి ఆరోపణలు చేయలేదు. కానీ, డబ్బులు తీసుకున్నారంటూ వైసిపి నాయకులు ఆరోపణలు చేశారు. దాంతో భూమా నాగిరెడ్డి తీవ్రంగా మండిపోయి - తాము గనక నోరు విప్పితే తీవ్ర ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేశారు.
బాబు వ్యూహం: జగన్ను ఇరుకున పెట్టిన భూమా!
భూమా ప్రతి సవాల్తో వైసిపి నాయకులు బిక్కచచ్చిపోయి మాట్లాడడం మానేశారు. నిజానికి, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం పోరుకు సిద్ధంగానే ఉన్నారు. త్వరలో జరగబోయే కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని అంటున్నారు. ఇందుకు ఎస్వీ మోహన్ రెడ్డి.. భూమా నాగిరెడ్డిలతో పాటు జిల్లా తెలుగుదేశం పార్టీ ముఖ్యులు ఇప్పట్నుంచే వ్యూహాలు రచిస్తున్నారు.
మరోవైపు పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలల స్థానాల్లో బలమైన నాయకులను ఎంపిక చేసి ఆ లోటును భర్తీ చేసేందుకు జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. నంద్యాల, ఆళ్లగడ్డ, కర్నూలు శాసనసభా నియోజకవర్గాలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బాధ్యతలను చేపట్టేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. ఈ స్థితిలోనే భూమా సవాల్ను స్వీకరించి, ఆయనను ఎదుర్కోవడానికి వైసిపి నాయకులు వెనకాడుతున్నారు.












Click it and Unblock the Notifications