కృష్ణమ్మకు జగన్ జలహారతి..! పులివెందులలో అరుదైన సీన్స్..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల టూర్ రెండోరోజూ విజయవంతంగా కొనసాగింది. తొలిరోజు కార్యకర్తలతో భేటీ అయిన జగన్ ప్రజాదర్బార్ నిర్వహించి వారి కష్టాలు విన్నారు. ఇవాళ రెండో రోజు పర్యటనలో భాగంగా మరోసారి వైసీపీ కార్యకర్తలు, స్దానిక నాయకులతో భేటీ అయ్యారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం పులివెందులకు తరలివచ్చిన కృష్ణా జలాలకు హారతి పట్టారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు పలువురు హాజరయ్యారు.
వైయస్ జగన్ రెండోరోజు పులివెందుల పర్యటనలో క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్భార్ కొనసాగించారు. పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో రెండో రోజు కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో ఆయన మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు.

వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైఎస్ జగన్ కు ఫిర్యాదులు చేశారు. వారి సమస్యలను విన్న జగన్.. అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏం చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సూచించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు ఒకటి కూడా జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్ జగన్, వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

అనంతరం అంబకపల్లె చెరువు వద్ద వైయస్ జగన్ కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఇవాళ అంబకపల్లెకు కృష్ణా జలాలు వచ్చి చేరాయి. పాడా నిధుల ద్వారా అంబకపల్లె గంగమ్మ కుంటకు రూ.1.4 కోట్లతో 14 ఎకరాల భూసేకరణ చేపట్టి కొత్త చెరువును నిర్మించారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఎంపీ నిధులతో రూ.2.50 కోట్లు వెచ్చించి హిరోజ్పురం గ్రామం వద్ద భారీ సంప్ను ఏర్పాటు చేసి 4.5 కి.మీ మేర అంబకపల్లె చెరువుకు పైపులైన్ ఏర్పాటు చేశారు. దీంతో అంబకపల్లె చెరువుకు కృష్ణా నీరు వచ్చి చేరింది. దీంతో ఈ ప్రాంత వాసులంతా సంతోషం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications