చంద్రబాబుపై జగన్ చెప్పిన పలావు-బిర్యానీ కథ..!
ఏపీలో వైసీపీ స్ధానంలో తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఎన్నో అంచనాలతో జనం వైసీపీని కాదని కూటమి పార్టీల్ని గెలిపించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీల్ని నిలబెట్టుకోవడంలో విఫలం కావడంపై విపక్ష వైసీపీ అధినేత జగన్ మరోసారి మండిపడ్డారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న జగన్.. ఇవాళ సీఎం చంద్రబాబు పాలనను ప్రజలు ఎలా భావిస్తున్నారో చెప్పేందుకు ఓ ఉదాహరణ ఇచ్చారు.
గతంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా వైసీపీ ప్రభుత్వం సాకులు చెప్పకుండా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిందని, మాట తప్పకుండా మ్యానిఫెస్టో అమలు చేసిన ఘనత తమదేనని వైఎస్ జగన్ గుర్తుచేశారు. గతంలో తాము చేసిన మంచి ఎక్కడికీ పోదని, వచ్చే ఎన్నికల్లో అదే తమకు శ్రీరామరక్ష కానుందన జగన్ పేర్కొన్నారు. అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీల్ని ఎలా విస్మరిస్తోందనో ఆయన వివరించారు.

జగన్ పలావు ఇచ్చాడు, బాగానే చూసుకున్నాడని, చంద్రబాబు బిర్యానీ పెడతానని మోసం చేశాడని అనుకుంటున్నారని వైసీపీ అధినేత తెలిపారు. ఇప్పుడు పలావు లేదు, బిర్యానీ కూడా లేదని, జనం పస్తులుండాల్సిన పరిస్ధితి ఉందన్నారు. జగన్ ఉంటే రైతు భరోసా ఉండేదని, అమ్మ ఒడి అందేదని, సున్నా వడ్డీ వచ్చేదని, విద్యాదీవెన, ఫీజు రీయింబర్స్ మెంట్, మత్సకార భరోసా, వాహనమిత్ర, వచ్చి ఉండేవన్నారు. కానీ వైసీపీ విపక్షంలో ఉండటంతో అవేవీ రావడం లేదన్నారు.
ఇంటికి పథకాలు వచ్చే పరిస్ధితి పోయిందని, మళ్లీ జన్మభూమి కమిటీల చుట్టూ, టీడీపీ నేతల చుట్టూ తిరగాల్సిన పరిస్ధితులు వస్తున్నాయని జగన్ విమర్శించారు. ఈ మోసాలు చూసి ప్రజల్లో ఆగ్రహం మొదలవుతోందని, మళ్లీ వైసీపీ గెలువబోతోందని జగన్ జోస్యం చెప్పారు. ఈ ఐదేళ్లు చాలా కష్టాలుంటాయని, గతంలోనూ తనను ఇలాగే ఇబ్బందులు పెట్టారని, చివరికి తాను గెలిచానని నేతలకు జగన్ గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications