ఆనంపై వేటుకు రంగం సిద్ధం ? వెంకటగిరి ఇన్ ఛార్జ్ గా నేదురుమల్లి రామ్-రేపు ప్రకటించే ఛాన్స్ !
ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో మరో రెబెల్ నేత రెడీ అవుతున్నారు. ఇప్పటికే సొంత పార్టీపై, ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్న నెల్లూరు జిల్లా సీనియర్ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిపై వేటుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఆయన్ను ఎమ్మెల్యే సీటు నుంచి తొలగించే అవకాశం లేకపోవడంతో ఆయన స్ధానంలో వెంకటగిరిలో పోటీ నేతను బరిలోకి దింపబోతున్నారు.
వెంకటగిరి నుంచి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం రామనారాయణరెడ్డి.. జగన్ రెండుసార్లు ఏర్పాటు చేసిన కేబినెట్లలో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆనంకు మంత్రి పదవి ఇచ్చేందుకు జగన్ ఇష్టపడలేదు. నెల్లూరు జిల్లాలో ఉన్న సమీకరణాలు, జగన్ సొంత సామాజిక వర్గం కావడం, ఇతరత్రా కారణాలతో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆనం పలు సందర్భాల్లో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విమర్శల దాడిని మరింత పెంచారు.
వైసీపీ ప్రభుత్వంతో పాటు పార్టీని, ప్రభుత్వ పథకాలను కూడా ఆనం విమర్శిస్తూ వస్తున్నారు. దీంతో ఆయన తీరుపై జిల్లాకు చెందిన స్ధానిక మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు ఇతర నేతలు, అధిష్టానం అసంతృప్తిగా ఉన్నారు. ఆనం తీరు నేపథ్యంలో ఆయనపై వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. వెంకటగిరిలో ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు పోటీగా మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డిని ఇన్ ఛార్జ్ గా నియమించాలని జగన్ దాదాపుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెంకటగిరిలో అనధికార ఎమ్మెల్యేగా రామ్ కుమార్ చెప్పుకుని తిరుగుతున్నట్లు కూడా ఆనం తాజాగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆనం స్ధానంలో ఇన్ ఛార్జ్ గా రామ్ కు జగన్ అవకాశం కల్పించబోతున్నారు. దీనిపై రేపు ప్రకటన వెలువడే అవకాశముంది. వచ్చే ఎన్నికల్లో రామ్ కు ఇక్కడి నుంచి వైసీపీ సీటు దక్కే అవకాశముంది.