16 నెలలకు ఇంటికి చేరిన జగన్: హారతిచ్చి స్వాగతం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి చేరుకోవడానికి ఐదున్నర గంటలు పట్టింది. చంచల్గుడా జైలు నుంచి తన లోటస్ పాండుకు చేరుకోవడానికి ఆయన అంతగా సమయం పట్టింది. మంగళవారం సాయంత్రం 3 గంటల50 నిమిషాల ప్రాంతంలో చంచల్గుడా జైలు నుంచి బయలుదేరిన జగన్ జూబ్లీహిల్స్లోని లోటస్ పాండుకు రాత్రి 9 గంటల 20 నిమిషాలకు చేరుకున్నారు.
16 నెలల తర్వాత ఇంటికి చేరిన జగన్కు కుటుంబ సభ్యులు ఆయనకు హారతి ఇచ్చి స్వాగతం చెప్పారు. అప్పటి వరకు భార్య భారతి, పిల్లలు, తల్లి వైయస్ విజయమ్మ, సోదరి షర్మిల తదితర కుటుంబ సభ్యులు, శోభా నాగిరెడ్డి వంటి పార్టీ నాయకులు ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అడుగడుగునా అభిమానులకు అభివాదం చేస్తూ ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన పయనం ఓ ఊరేగింపును తలపించింది.
ఖైరతాబాద్ ఆర్టిఎ కార్యాలయం వద్ద జగన్ వాహనం చాలా సేపు ఆగిపోయింది. పంజగుట్ట మీదుగా వెళ్లి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించాలని అభిమానులు పట్టుబట్టారు. అయితే, ట్రాఫిక్ ఇబ్బందులుంటాయని పోలీసులు చెప్పారు. దాంతో జగన్ అభిమానులకు నచ్చజెప్పి పోలీసులు నిర్దేశించిన మార్గంలోనే పయనించారు.

తాజ్ డెక్కన్ హోటల్ మీదుగా పంజగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద జగన్ కారు దిగి అక్కడ తన కోసం వేచి ఉన్న అభిమానులను పలకరించారు. రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో కెబిఆర్ పార్కు వద్దకు చేరుకున్నారు.
మార్గమధ్యంలో అభిమానులు జగన్తో కరచాలనం చేయడానికి ప్రయత్నించారు. బంజారా మహిళలు నృత్యం చేశారు. ఇంట్లోకి వెళ్లడానికి జగన్కు చాలా కష్టమైంది. అభిమానులు పెద్ద యెత్తున ఆయనను చుట్టుముట్టారు. కరచాలనం చేయడానికి ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications