గోదావరి వరద-బాధితులకు జగన్ సర్కారీ సంస్ధ రూ.5 కోట్ల విరాళం-సీఎం టూర్ కు ముందే..
గోదావరి నదికి ఈ ఏడాది వచ్చిన తీవ్ర వరదల కారణంగా పలు జిల్లాల్లో జనం అష్ట కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా లంక గ్రామాల పరిస్ధితి తీసికట్టుగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారికి రెండు వేల రూపాయల చొప్పన సాయంతో పాటు కూరగాయలు, ఇతర సాయం అందిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వ సంస్ధ ఏపీఎండీసీ కూడా వారికిసాయం చేసేందుకు ముందుకొచ్చింది.
గోదావరి వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) ఇవాళ రూ.5కోట్ల విరాళం అందించింది. ఈ మొత్తానికి సంబంధించిన చెక్ను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్కు గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, డైరెక్టర్ వీజీ.వెంకటరెడ్డి అందజేశారు.
గోదావరి వరద సహాయక ప్రాంతాల్లో రేపు సీఎం జగన్ పర్యటించబోతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు గోదావరి వరద ప్రభావిత జిల్లాల్లో జగన్ పర్యటన కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు. అంతకుముందే ప్రభుత్వ సాయంత పాటు ఏపీఎండీసీ కూడా వరద బాధితుల కోసం రూ.5 కోట్లు అందించింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్ని మరింత ముమ్మరం చేసేందుకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందే ఏపీఎండీసీ ఈ సాయం ప్రకటించడం, చెక్ కూడా అందించడంపై హర్షం వ్యక్తమవుతోంది.