జగన్కు వైద్య పరీక్షలు: కుప్పకూలే ప్రమాదం, దీక్ష విరమణకు నో
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష సోమవారంనాడు ఆరో రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. సోమవారం ఉదయం రెండు సార్లు వైద్యులు ఆయన పరీక్షలు నిర్వహించారు.
జగన్ శరీరంలో కీటోన్స్ 3+కు స్థాయికి చేరుకున్నాయి. కీటోన్ బాడీస్ పాజిటివ్ అంటేన్ ప్రమాదాన్ని సూచిస్తుందని, 3+ అంటే మరింత విషమమని వైద్యులు చెప్పారు. శరీరంలోని అన్ని వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని వారన్నారు. గుండె, కిడ్నీలపై దాని ప్రభావం పడుతుందని అంటున్నారు. ఆయన కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
Photos: జగన్ దీక్ష
కీటోన్ బాడీస్ శరీరంలో ఉండకూడదని, అయితే ప్రస్తంత జగన్ శరీరంలో 3+ కీటోన్ బాడీస్ ఉన్నాయని, గంటగంటకూ జగన్ ఆరోగ్యం క్షీణిస్తోందని, దీక్ష విరమించడమే మంచిదని వైద్యులు అన్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు నాయకులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీక్ష విరమించాల్సిందిగా వారు జగన్ను కోరారు
వైద్య పరీక్షల వివరాలను ప్రభుత్వాస్పత్రి వైద్యుడు సోమవారం ఉదయం వెల్లడించారు. జగన్ పల్స్ రేటు 68, బీపీ 130/80, బరువు 72.9 కిలోలు, బ్లడ్ షుగర్ 61, కీటోన్స్ 3+ ఉన్నట్లు గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ రమేష్ చెప్పారు. మరికాసేపట్లో సీనియర్ వైద్యుల బృందం ఒకటి గుంటూరు నల్లపాడు రోడ్డులో దీక్షాస్థలికి వచ్సి జగన్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తుంది.