గడువు ముగిసినా జగన్ ప్రచారం: అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్: ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన తర్వాత ప్రచారం నిర్వహించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. సోమవారం హైదరాబాద్లోని ఖైరతాబాద్, యూసుఫ్గూడ, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో పర్యటించిన వైయస్ జగన్, సాయంత్రం 6 గంటల తర్వాత ఇబ్రహీంపట్నం చేరుకుని ప్రచారం నిర్వహిస్తుండటంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.
ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం తెలంగాణలో సోమవారం సాయంత్రం 6 గంటలకే ప్రచారం గడువు ముగిసింది. దీంతో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ను అడ్డుకుని, ప్రచారాన్ని నిలిపేయాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. చేసేదేమి లేక అక్కడి నుంచి హైదరాబాద్కు జగన్మోహన్ రెడ్డి బయల్దేరారు.
అంతకుముందు ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలను గిన్నీస్ బుక్లో ఎక్కించాలని అన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణంలో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. చంద్రబాబు నాయుడు హయాంలో సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందలేదన్న ఆయన, ఈ రంగ అభివృద్ధిలో రాష్ట్రం మూడవ స్థానం నుంచి ఐదవ స్థానానికి పడిపోయిందని అన్నారు.
తెలంగాణ తన సోదరి షర్మిల ఓదార్పు యాత్రను కొనసాగిస్తారని వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఏదో ఓ రోజు తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విశ్వసనీయ లోపించిందని, రాజకీయాల్లో మార్పు అవసరమని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నేతలు విస్మరిస్తున్నారని, ఎన్నికల ముందు ఒకలా.. తర్వాత మరోలా చెబుతున్నారని జగన్ చెప్పారు.