గుంటూరులో వైయస్ జగన్ ఫ్లెక్సీలను పీకేశారు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం గుంటూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన దీక్షకు ఆటంకాలు తొలిగి సూచనులు కనిపించడంలేదు. పోలీసులు మూడు కారణాల వల్ల అక్కడ దీక్షకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వెంటనే జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు తొలగించాలని సూచించారు.
అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు స్పందిచకపోవడంతో మునిసిపల్ అధికారులు రంగంలోకి దిగి జగన్ ఫ్లెక్సీలను సభా ప్రాంగణం నుంచి పీకేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త చోటుచేసుకుంది. అయితే పోలీసులు పెద్దఎత్తున రంగంలోకి దిగడంతో కార్యకర్తలు వెనక్కి తగ్గారు.
కాగా, 26వ తేదీన తను చేపట్ట దలచిన ఆమరణ నిరాహార దీక్షకు ప్రభుత్వమే కుట్రపూరితంగా అడ్డు తగులుతోందంటూ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న తేదీ నాడు తను దీక్ష చేస్తానని ఆయన అంటున్నారు. ఇంకోవైపు గుంటూరులో దీక్షకు అనుమతి నిరాకరించడంతో వైయస్సార్ కాంగ్రెసు నాయకులు గుంటూరులో సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకునే అంశంపై కూడా చర్చిస్తున్నారు. అయితే కోర్టుకు వెళితే ఒకవేళ అనుమతి రాకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటంతో న్యాయవాదులను సంప్రదించి తగు నిర్ణయాన్ని తీసుకోవాలని అనకుంటున్నట్లు సమాచారం.