వివేకా హత్యకేసులో జగన్ - టీడీపీ మైండ్ గేమ్ ! సునీత ఫ్యామిలీ సజ్జల మాట వింటారా ?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటికే సేకరించిన వాంగ్మూలాల ఆధారంగా ఈ కేసులో అసలు నిందితుల్ని గుర్తించడంలో విజయవంతమైన సీబీఐ.. ఇప్పుడు వారిని నిందితులుగా నిరూపీంచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సీబీఐకి నిందితులు గతంలో ఇచ్చిన వాంగ్మూలాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తుండటంతో వాటిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు విపక్ష టీడీపీ ప్రయత్నిస్తోంది.
Recommended Video

వివేకా కేసులో ట్విస్టులు
వివేకా హత్య కేసులో సీబీఐ గత ఏడాది నిందితులతో పాటు సాక్షుల నుంచి సేకరించిన వాంగ్మూలాలు ఇప్పుడు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇందులో అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ట్విస్టులపై ట్విస్టులుగా సాగిపోతున్న వివేకా హత్య కేసు దర్యాప్తుపై ఇప్పటివరకూ ఉన్న అపోహల్ని ఇవి పూర్తిగా మార్చేసాయి. అంతే కాదు వైఎస్ కుటుంబాన్ని పూర్తిగా టార్గెట్ చేసేలా ఉన్నాయి. దీంతో వీటిని సొమ్ము చేసుకునే పనిలో టీడీపీ బిజీగా కనిపిస్తోంది.

టీడీపీ మైండ్ గేమ్
వివేకా హత్య కేసులో బయటపడుతున్న వాంగ్మూలాల్లో అంశాలు వివేకా హత్య కేసులో వైఎస్ కుటుంబంలో కొందరిని నిందితులుగా చూపుతుండటంతో వాటిని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు టీడీపీ మైండ్ గేమ్ మొదలుపెట్టేసింది. ముఖ్యంగా సీఎం జగన్ ను ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా చూపేందుకు టీడీపీ నానా కష్టాలు పడుతోంది. ఇందులో భాగంగా తాజాగా బయటపడిన వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలాన్ని హైలెట్ చేస్తూ సొంత మీడియాలో బ్యానర్లు పెట్టించింది. అదే సమయంలో చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి జగన్ ను సీబీఐ విచారించాలంటూ డిమాండ్లు చేస్తున్నారు.

గతాన్ని గుర్తుచేసుకున్న సజ్జల
వైఎస్ వివేకా కేసులో సీబీఐ తీరు, టీడీపీ మైండ్ గేమ్ పై నిన్న ప్రెస్ మీట్ పెట్టిన సజ్జల గతంలో ఇదే తరహాలో చోటు చేసుకున్న పలు ఘటనల్ని గుర్తుచేశారు. ముఖ్యంగా రాజారెడ్డి హత్య నుంచి మొదలుపెట్టి జగన్ కేసులు, వివేకా హత్య కేసు వరకూ తమ ప్రత్యర్ధులు తమను ఎలా టార్గెట్ చేశారో వెల్లడించారు. సీబీఐ తీరు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ లీకులిస్తుండటం, వాటిని అందిపుచ్చుకుంటూ టీడీపీ,ఎల్లో మీడియా ఎలా ప్రచారం చేస్తున్నారో చెప్తూ సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ ప్రచారానికి కారణమవుతున్న సునీతారెడ్డికి కీలక సూచన చేశారు.

సునీత కుటుంబం సజ్జల సూచన వింటుందా ?
వివేకా హత్య అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో దూకుడుగా వ్యవహరించకుండా వివేకా కుమార్తె సునీతారెడ్డి కుటుంబాన్ని జగన్, సజ్జల నియంత్రించారని సునీత వాంగ్మూలంలో తెలిపారు. ముఖ్యంగా జగన్ సూచనలతో పాటు సజ్జల సలహాల్ని కూడా సునీత ఇప్పటికే బయటపెట్టేశారు. ఈ క్రమంలో టీడీపీ మైండ్ గేమ్ లో పావులు కావొద్దంటూ సునీతారెడ్డి కుటుంబానికి సజ్జల తాజాగా సలహా ఇచ్చారు. ఇప్పటికే జగన్, సజ్జల తమకు ఏం చెప్పారో సీబీఐ వాంగ్మూలంలో బయటపెట్టేసిన సునీతారెడ్డి.. ఈ ప్రభుత్వంలో వివేకా అనుచరుల్ని ఎలా టార్గెట్ చేశారో కూడా వెల్లడించారు. దీంతో ఇప్పుడు సజ్జల చేసిన సూచనను సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి వింటారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.












Click it and Unblock the Notifications