జేసీ బ్రదర్స్ ఇలాకాలో జగన్ సభ! మారిన సమీకరణాలు, ఈసారి పోరు రసవత్తరమే!
అనంతపురం: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రారంభించిన 'ప్రజాసంకల్పం' పాదయాత్ర 28వ రోజుకు చేరుకుంది. అనంతపురం జిల్లాలో నాలుగో రోజైన బుధవారం కూడా జగన్ పాదయాత్రను సాగిస్తున్నారు.
ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జేసీ బ్రదర్స్ ఇలాకాలో తన యాత్ర సాగిస్తున్నారు. అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గంతో మొదలైన జగన్ పాదయాత్ర.. తాడిపత్రి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి ప్రవేశించింది.
జేసీ బ్రదర్స్ కంచుకోటలో...
తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పెద్దవడుగూరులో నిన్న జగన్ సభ కూడా నిర్వహించారు. ఈ సభకు భారీ ఎత్తున జనసందోహం హాజరుకావడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. తాడిపత్రి అసెంబ్లీ సెగ్మెంట్ అనేది దశాబ్దాలుగా జేసీ బ్రదర్స్కు కంచుకోటలాంటిది. అలాంటిచోట తమ సభ విజయవంతం కావడంపై వైసీపీ స్థానిక నాయకత్వం ఆనందంగా ఉంది.
తాడిపత్రికి ఇన్ చార్జిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి...
జేసీ బ్రదర్ప్గా పేరొందిన జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన తరువాత తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా ఉండగా, ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలుగుదేశంలోకి వచ్చినప్పట్నించి వారు వైసీపీ అధినేత వైఎస్ జగన్పై తరచూ మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వారిని ఎదుర్కొని నిలిచందేకు వైసీపీ తాడిపత్రి ఇన్ చార్జిగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియమించారు జగన్.
దశాబ్దాలుగా రాజకీయ వైరం...
గతంలో కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి తాడిపత్రిలో జేసీకి వ్యతిరేకంగా పోటీ చేశారు. జేసీ, కేతిరెడ్డి కుటుంబాల మధ్య దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉంది. ఈ క్రమంలో సూర్యప్రతాపరెడ్డి తమ్ముడినే తాడిపత్రి ఇన్ చార్జిగా ప్రకటించారు జగన్. రాజకీయ సమీకరణాలు మారడంతో ఇక్కడ ఈసారి పోరు మరింత రసవత్తరంగా మారనుంది. పెద్దారెడ్డి కొన్నాళ్లుగా తాడిపత్రిలోనే మకాం పెట్టి రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పట్నించే వైసీపీ గెలుపునకు ఆయన కృషి చేస్తున్నారు.
కొనసాగుతున్న పాదయాత్ర...
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో కొనసాగుతోంది. మంగళవారం అనంతపురం జిల్లా గుత్తి నుంచి మొదలైన పాదయాత్ర ఆవలంపల్లి, విరుపాపురం, పెద్దవడుగూరు, చిన్నవడుగూరు మీదుగా కొట్టాలపల్లి వరకు సాగింది. 27వ రోజు పాదయాత్రలో జగన్ 15 కిలోమీటర్లు నడిచారు. పెద్దవడుగూరులో బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. బుధవారం పెద్దవడుగూరులో పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజల నీరాజనాలు అందుకుంటూ ముందుకుసాగుతున్నారు.
సమస్యలు విని.. చలించిపోయి...
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తోన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ వీరన్నపల్లెలో పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న ఆయన చలించిపోయారు. పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని జననేతతో మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పత్తికి రాష్ట్ర ప్ర��ుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ మహిళా కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. కూలి ధరలు తగ్గిపోవడంతో తినడానికి కూడా కష్టమవుతోందని, తమ పిల్లలను చదివించలేక వ్యవసాయ పనుల్లో పెట్టామని చెప్పడంతో జగన్ చలించిపోయారు. వైయస్సార్సీపీ అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు తీరిపోతాయని వారికి ధైర్యం చెప్పారు.