కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు: నిమ్మకూరులో జగన్ ప్రకటన, కొనకళ్లపై బసవతాకరకం బంధువుల ఫిర్యాదు
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సంచలన ప్రకటన చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లా పేరును తాను నందమూరి తారక రామారావు జిల్లా పేరుగా మారుస్తానని చెప్పారు.
Recommended Video
జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర నిమ్మకూరులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఈ సంచలన ప్రకటన చేశారు. కృష్ణా జిల్లాను, నిమ్మకూరును అభివృద్ధి చేస్తామని చెప్పారు. జగన్ ప్రకటనపై లక్ష్మీపార్వతి హర్షం వ్యక్తం చేశారు.
ఎంపీ కొనకళ్లపై జగన్కు ఫిర్యాదు
అంతకుముందు, జగన్కు బందర్ ఎంపీ కొనకళ్ల నారాయణ రావుపై బసవతాకరకం బంధువులు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. పమిటిముక్కల మండలం మంటాడ మండలంలో జగన్ ప్రజా సంకల్ప యాత్ర జరిగింది. ఈ యాత్రలో భాగంగా ఆయన తాడంకి వచ్చారు. ఎన్టీఆర్ సతీమణి బసవతాకరకం బంధువులుగా చెప్పుకుంటున్న కాట్రగడ్డ శివలీల, వంశీకృష్ణలు బందర్ ఎంపీ కొనకళ్లపై ఆరోపణలు చేస్తూ వినతిపత్రం ఇచ్చాు.
ఫిర్యాదు.. ఏం జరిగిందంటే?
కొనకళ్ల నారాయణ రావు అండతో ఆయన మేనల్లుడు పామర్తి అనిల్ వేధింపులకు పాల్పడుతున్నారని వారు జగన్కు ఫిర్యాదు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో తన కుమారుడు, కోడలు ఇద్దరు చిన్నారులను పోలీసులతో కిడ్నాప్ చేయించారని ఆరోపించారు. ఈ నెల 24న తన కొడుకు రామ్ కుమార్ను బందర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వారిని విడిచిపెట్టాలంటే చెక్కులపై సంతకాలు చేయించుకున్నారని పేర్కొన్నారు.
కొనకళ్లపై ఫిర్యాదు, జగన్ హామీ
నాలుగు రోజులుగా రాంకుమార్ అచూకీ తెలియడంలేదని వారు జగన్కు ఫిర్యాదు చేశారు. ఆస్తి మొత్తం ఇస్తేనే వదిలి పెడతామని అంటున్నారని ఆరోపించారు. రాం కుమార్కు ఎంపీ కొనకళ్ల వల్ల ప్రాణహానీ ఉందని, దయచేసితమ కుటుంబాన్ని రక్షించాలని కాట్రగడ్డ శివలీల ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసు అధికారులతో మాట్లాడుతానని జగన్ హామీ ఇచ్చారు.
టీటీడీ బోర్డులో బీజేపీ మంత్రి భార్య
అంతకుముందు రోజు, జగన్ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి హోదాను నాలుగేళ్లుగా ఖూనీ చేసి, ప్రజలను అన్ని విధాలా మోసం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు అదే హోదా కోసం ధర్మపోరాటం పేరుతో దీక్షలు చేస్తున్నారనిమండిపడ్డారు. ఒవైపు బీజేపీపై విరుచుకుపడుతున్న చంద్రబాబు, మరోవైపు అదే పార్టీకి చెందిన మహారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్యను టీటీడీ బోర్డులో సభ్యురాలిగా నియమించారన్నారు.
ఓ వైపు అనుకూలం, మరోవైపు దీక్ష
తిరుమలలో బీజేపీకి అనుకూలంగానూ, తిరుపతిలో కేంద్రం మోసం చేసిందంటూ దీక్ష చేయడమూ ముఖ్యమంత్రి మోసాలకు నిదర్శనమని జగన్ అన్నారు. పామర్రులో ఫ్లోరైడ్ సమస్య గురించి ఫిర్యాదు చేసిన రైతులు తమకు తాగడానికి మంచినీరు కూడా లేదని అవేదన చెందుతున్నారన్నారు. పమిడిముక్కల మండలం మారాడకు చెందిన ఎస్సీలు వచ్చి తమ బాధలు చెప్పుకున్నారన్న జగన్... నాడు వైయస్ హయాంలో కట్టించిన ఇందిరమ్మ కాలనీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కనీస వసతులు కల్పించడం లేదన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు ఒక్క ఇల్లూ ఇవ్వలేదని వారు చెబితే బాధ కలిగిందన్నారు. రైతుల బాధ చూస్తుంటే కళ్లలో నీరు వస్తోందన్నారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక కంటే రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర రూ.7 ఎక్కువగా ఉందన్నారు.