బాబుపై టాడా కేసు ఎఫెక్ట్: జగన్ వైసిపికి రిజైన్ చేయాలని టిడిపి డిమాండ్
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు పైన టాడా కేసు పెట్టాలని వ్యాఖ్యానించిన వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం నిప్పులు చెరిగారు. అసలు జగన్కు టాడా యాక్ట్ అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు.
తీవ్రవాదులు, దేశద్రోహుల పైన టాడా కింద కేసులు పెడతారని, అలాంటి కేసును చంద్రబాబుపై జగన్ పెట్టమని అనడంలో అర్థం లేదన్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎక్కడా ఆయనపై మచ్చలేదన్నారు.
తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి పదవిని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ తీరువల్ల ఐఏఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలు జైలుకు వెళ్లారన్నారు. అనతి కాలంలోనే జగన్ ఇంత ఎలా సంపాదించాడని సిబిఐ చీఫ్ రంజింత్ సింగ్ ఆక్షేపించారని గుర్తు చేశారు.
11 కేసుల్లో ఏ 1 ముద్దాయిగా ఉన్న జగన్కు చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు. ఆ కేసుల్లో జగన్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించే వరకు ఆయన వైసిపి అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
హోదా ముగిసిన అధ్యాయం: వెంకయ్య
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ఇప్పుడు విమర్శలు చేస్తున్న వారంతా ఆనాడు ఏమయ్యారో చెప్పాలని ప్రశ్నించారు. నవ్యాంధ్రకు మోసం జరుగుతుంటే ఇప్పుడు ఎందుకు అడ్డుకోలేకపోయారో చెప్పాలని విపక్షాలను నిలదీశారు.