ఏపీలో ఇళ్ల పట్టాల రద్దుపై జగన్ ఫైర్..! ఆందోళనలకు పిలుపు..!
ఏపీలో ఇళ్ల పట్టాల రద్దుకు జరుగుతున్న ప్రయత్నాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ లో సుదీర్ఘ ట్వీట్ పెట్టారు. ఇందులో సీఎం చంద్రబాబును ఉద్దేశించి... మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్నవాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యిందని జగన్ ఫైర్ అయ్యారు.
పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసిమరీ ఇచ్చిన ఇళ్లస్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? వాళ్లు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి, మా హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా? అక్కచెల్లెమ్మల ఉసురు పోసుకుంటారా? తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. చంద్రబాబు హయాంలో ఇళ్ల పట్టాలూ ఇవ్వక, ఇళ్లూ కట్టించక పేదలు ఎంతోమంది నిరాశ్రయులుగా మిగిలిపోయారని, కాని తాము వారి సొంతింటి కలను నిజం చేసేలా "పేదలందరికీ ఇళ్లు'' కార్యక్రమం కింద 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి, వారి పేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించామన్నారు.

ఇందులో వాటి కొనుగోలుకే రూ.11,871 కోట్లు ఖర్చుచేశామని జగన్ గుర్తుచేశారు. తమ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాల విలువ మార్కెట్ రేట్లతో చూస్తే రూ.1.5లక్షల కోట్లపైమాటేనన్నారు. ఇంటిపట్ టావిలువే ఒక్కోచోట రూ. 2.5 లక్షల నుంచి రూ.10లక్షలు-రూ.15లక్షల వరకూ ఉందన్నారు. ఇళ్లపట్టాలకోసం, ఇళ్లకోసం ధర్నాలు, ఆందోళనలు తమ ఐదేళ్ల కాలంలో కనిపించకపోవడమే తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. మరి చంద్రబాబు.. మీ జీవితకాలంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పని చేశారా? మీరు చేయకపోగా, మేం చేపట్టిన కార్యక్రమాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిందిపోయి ఇప్పుడు అన్నింటినీ నాశనం చేస్తున్నారని జగన్ విమర్శించారు.
మా హయాంలో మేం 21.75 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని శాంక్షన్ చేయించి, మొదలుపెట్టడం ద్వారా ఏకంగా 17,005 కాలనీలు ఏర్పడ్డాయి. కోవిడ్లాంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ అనతి కాలంలోనే ఇందులో 9 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేశాం. అక్టోబరు 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లను ప్రారంభించి చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించాం. చంద్రబాబుగారూ మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా? అలా చేయకపోగా ఇప్పుడు మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని ఎందుకు నిలిపేశారు? ఇది పేదల ఆశలను వమ్ము చేయడం కాదంటారా?

తమ హయాంలో "పేదలకు ఇళ్లు'' కార్యక్రమం ముందుకు వెళ్లకూడదని మీరు చేయని పన్నాగంలేదన్నారు. మీ పార్టీ నాయకుల ద్వారా మీరు కోర్టులో కేసులు వేయించారని, అమరావతిలో 50వేల పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇస్తే, సామాజిక అసమతుల్యత వస్తుందని కోర్టుల్లో వాదించి స్టేలు తేవడమే కాకుండా, అధికారంలోకి రాగానే కర్కశంగా వ్యవహరించి ఇచ్చిన ఆ పట్టాలను రద్దుచేసి విజయవాడ, గుంటూరు నగరాల్లోని పేదలకు తీరని ద్రోహం చేశారన్నారు. మరి మీరు చేసింది ద్రోహం కాదా? పేద కుటుంబాలమీద మీరు కక్ష తీర్చుకోవడం లేదా? అని ప్రశ్నించారు.
.@ncbn గారూ… మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్నవాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యింది. పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్…
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 18, 2025
ఈ 16-17 నెలల కాలంలో పేదలకు ఇళ్ల విషయంలో మీ పనితీరు చూస్తే సున్నా అన్నారు. మీరు అధికారంలోకి వస్తే మాకు మించి ఇస్తామన్నారు. కాని, ఇప్పటివరకూ ఒక్క ఎకరం గుర్తించలేదు, ఒక్క ఎకరం కొనలేదు. ఏ ఒక్కరికీ పట్టాకూడా ఇవ్వలేదు. ఎవ్వరికీ ఇల్లుకూడా ఇవ్వలేదన్నారు. పైగా ఇప్పుడు ఇచ్చిన వాటిని లాక్కునే దిక్కుమాలిన పనులు చేస్తున్నారన్నారు. ఇంత చెత్తగా పరిపాలిస్తూ మరోవైపు పేదలకు ఇచ్చిన ఇళ్లపట్టాలను లాక్కుంటున్నారన్నారు. దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పేదలకొరకు అవసరమైతే దీనిపై న్యాయపోరాటాలు చేస్తామని, వారికి అండగా నిలబడతామని తెలిపారు. ధర్నాలు, నిరసనలు, ఆందోళనలకు సిద్ధం కావాల్సిందిగా కేడర్కు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications