అఖిలప్రియXశిల్పా: దెబ్బకొట్టిన చంద్రబాబుపై జగన్ సరికొత్త ప్లాన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశలపై ఏపీ సీఎం, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నీళ్లు చల్లారా? అంటే అవుననే అంటున్నారు.
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశలపై ఏపీ సీఎం, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నీళ్లు చల్లారా? అంటే అవుననే అంటున్నారు.
నంద్యాల ఉప ఎన్నికల అభ్యర్థి అంశం టిడిపిలో వేడి రాజేసిన విషయం తెలిసిందే. ఈ టిక్కెట్ పైన భూమా కుటుంబం, శిల్పా మోహన్ రెడ్డిలు ఆశలు పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
నంద్యాలపై బాబు కొత్త ట్విస్ట్: శిల్పా యూ టర్న్, అఖిలప్రియ మెట్టు దిగారా?
నంద్యాల టిక్కెట్ దాదాపు భూమా కుటుంబానికి ఖరారయిందని కొద్ది రోజుల క్రితం అర్థమైంది. దీంతో శిల్పా మోహన్ రెడ్డి టిడిపిని వీడి వైసిపిలో చేరాలని భావించారు. ఆ తర్వాత చంద్రబాబును కలిసి తన ఆవేదన వెళ్లగక్కడంతో అంతా రివర్స్ అయింది. చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు.
ఇటు భూమా కుటుంబం, అటు శిల్పా మోహన్ రెడ్డిపై తన ప్లాన్ రివర్స్ కావడంతో జగన్ మరో కొత్త ప్రణాళికతో ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవిని చేపట్టిన గంగుల ప్రభాకర్ రడ్డిని నంద్యాల ఉప ఎన్నికల బరిలో దించే ఆలోచన జగన్ చేస్తున్నారని సమాచారం.
తెరపైకి గంగుల పేరు
స్థానిక నేత రాజగోపాల్ రెడ్డి నంద్యాల నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ భూమా కుటుంబానికి పోటీ ఇవ్వగల సత్తా గంగుల కుటుంబానికే ఉందని జగన్ ఆలోచించి.. ఆ దిశగా పావులు కదుపుతున్నారని సమాచారం. నంద్యాల బాధ్యతను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అప్పగించనున్నారని తెలుస్తోంది.
బాబుకు చెక్ చెప్పాలనుకున్న జగన్
కాగా, శిల్పా మోహన్ రెడ్డి, లేదంటే భూమా కుటుంబ సభ్యులకు వైసిపి టిక్కెట్ ఇవ్వడం ద్వారా చంద్రబాబుకు చెక్ చెప్పాలని జగన్ తొలుత భావించారు. కానీ టిడిపి మాత్రం ఇరువురితో చర్చోపచర్చలు జరుపుతోంది.
అఖిల కుటుంబానికి టిక్కెట్ ఇస్తే శిల్పా మోహన్ రెడ్డి కచ్చితంగా టిడిపిలో ఉండకపోయేవారు. అప్పుడు ఆయనను వైసిపిలో చేర్చుకొని గెలిపించుకుందామని జగన్ భావించారు.
భూమా ఫ్యామిలీతో ప్లాన్
శిల్పాకు టిక్కెట్ ఇస్తే.. భూమా కుటుంబానికి వైసిపి నుంచి టిక్కెట్ ఇవ్వాలని జగన్ భావించారు. అప్పుడు భూమా టిడిపిలో చేరినప్పటికీ.. ఆ కుటుంబానికి చంద్రబాబు టిక్కెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారని, తాము టిక్కెట్ ఇచ్చామని చెప్పాలని భావించారంటున్నారు.
ఇలా కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు
శిల్పా మోహన్ రెడ్డికి టిక్కెట్ పైన చంద్రబాబు నుంచి పక్కాగా కాకపోయినప్పటికీ.. ఎంతో కొంత హామీ రాకపోయి ఉంటే ఇప్పటికే పార్టీ వీడేవారని చెబుతున్నారు. కానీ ఆయన పార్టీ వీడలేదంటే భూమా కుటుంబంతో పాటు శిల్పా మోహన్ రెడ్డికి బుజ్జగింపులు కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు.
శిల్పా మోహన్ రెడ్డి యూ టర్న్
పదిహేను రోజుల క్రితమే, శిల్పా మోహన్ రెడ్డి తన వర్గీయులతో మాట్లాడుతూ.. మూడు రోజుల్లో ఏం చేస్తానో చెబుతానన్నారు. కానీ ఇంత వరకు ఆయన నిర్ణయం తీసుకోలేదు. అఖిలప్రియ, శిల్పాలు అభ్యర్థి ఎంపికను చంద్రబాబు పైన వేసినట్లు చెప్పారు. ఈ మాటలను బట్టే వారు ఎంతోకొంత చంద్రబాబు మాటలకు కట్టుబడి ఉన్నారని అర్థమవుతోందంటున్నారు.
ఎవరికి ఎదురు దెబ్బ..
మొత్తానికి శిల్పా మోహన్ రెడ్డికి లేదా భూమా కుటుంబానికి టిక్కెట్ ఇవ్వడం ద్వారా అక్కడ తన పార్టీని తిరిగి బలంగా చేయాలనకున్న జగన్కు.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎదురు దెబ్బ తగిలినట్లే అంటున్నారు. శిల్పాకు టిక్కెట్ ఇచ్చి భూమా కుటుంబాన్ని బుజ్జగించే ప్రయత్నాలో టిడిపిలో జరుగుతున్నాయని, ఆ దిశలో అధినేత చర్చిస్తున్నారని అంటున్నారు. దీంతో జగన్ తెరపైకి గంగుల పేరును తెరపైకి తెచ్చారు.