బిగ్ ప్లాన్ రెడీ చేస్తున్న జగన్ ..! చంద్రబాబుకు షాకిచ్చేలా కీలక అడుగులు..!
ఏపీలో గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుంగిపోయి ఉంటారని, వచ్చే ఎన్నికల వరకూ తిరిగి కోలుకోవడం అసాధ్యమని అంతా భావించారు. దీంతో ఇంకా వైసీపీని అంటిపెట్టుకుని ఉన్న కాస్తో కూస్తో నేతల్ని కేసులు, దాడులతో టార్గెట్ చేస్తే ఇక ఆ పార్టీ కనుమరుగవుతుందని కూటమి సర్కార్ లెక్కలేసుకుంది. అందుకు తగ్గట్టుగానే ప్లాన్ ను అమల్లో పెట్టేసింది. అయితే జగన్ కూటమి ఊహకు అందనంత వేగంగా పావులు కదుపుతున్నారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏడాది పాటు బెంగళూరుకే ఎక్కువగా పరిమితం అవుతూ వచ్చిన జగన్.. తాజాగా పూర్తిగా గేరు మార్చేశారు. బెంగళూరు కంటే తాడేపల్లిలోనే ఎక్కువగా ఉంటూ, నేతల్ని కలుస్తూ, ప్రెస్ మీట్లు పెడుతూ, జిల్లాల్లో వరుసగా పర్యటిస్తూ హల్ చల్ చేస్తున్నారు. దీంతో ఇంత తక్కువ సమయంలో తమ అంచనాలకు భిన్నంగా జగన్ దూకుడు ప్రదర్శిస్తుండటం కూటమికి సైతం మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలో జగన్ టూర్లలో వరుస కేసులు నమోదు చేస్తున్నారు.

అదే సమయంలో క్షేత్రస్దాయిలో వైసీపీ ప్రజాప్రతినిధుల్ని, క్యాడర్ ను టార్గెట్ చేస్తూ వరుసగా కేసులు పెడుతున్నారు. తద్వారా వీరంతా వైసీపీని వీడి అధికార పార్టీల్లే చేరిపోతారని అంచనా వేశారు. కానీ అంచనాలకు భిన్నంగా పలు చోట్ల స్ధానిక సంస్ధల్లో ఇంకా వైసీపీ ఆధిపత్యం కొనసాగుతోంది. అంతెందుకు విజయవాడ కార్పోరేషన్ లో సైతం మేయర్ పీఠం వైసీపీ చేతుల్లోనే ఉంది. దీంతో మద్యం కేసును తెరపైకి తెచ్చి కీలక నేతల్ని అరెస్టు చేసి భవిష్యత్తులో జగన్ ను సైతం అరెస్టు చేస్తామని లీకులు ఇవ్వడం ప్రారంభించారు. కానీ సిట్ దూకుడు ఊహించిన స్ధాయిలో లేకపోవడంతో తిరిగి కూటమి జగన్ అరెస్టు అంటూ మైండ్ గేమ్ ప్రారంభించింది.
దీంతో జగన్ ఇప్పుడు వరుస కేసుల నుంచి తమ క్యాడర్, నాయకుల్ని రక్షించుకునేందుకు దీటైన వ్యూహంతో సిద్దమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ లీగల్ సెల్ ను బలోపేతం చేస్తున్నారు. నిన్న తాడేపల్లిలో లీగల్ సెల్ కార్యాలయం ప్రత్యేకంగా ప్రారంభించారు. త్వరలో యాప్ తెచ్చి వైసీపీ క్యాడర్ నుంచి ఫిర్యాదులు తీసుకుంటామని, వాటిపై అధికారంలోకి వచ్చాక చర్యలు ఉంటాయని జగన్ స్వయంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఇవాళ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైయస్సార్సీపీ లీగల్సెల్ న్యాయవాదులతో జగన్ సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీ నేతల్ని ఎలా కాపాడుకోవాలన్న దానిపై వారికి దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు నిన్న తాడేపల్లిలో ప్రారంభించిన లీగల్ సెల్ కార్యాలయంలో నిత్యం లాయర్లను అందుబాటులో ఉంచడం ద్వారా పార్టీ నాయకుల్లో స్థైర్యం నింపాలన్ జగన్ భావిస్తున్నారు. భవిష్యత్తులో తాము వెనక్కి తగ్గకుండా ఇలాగే పోరాడితే చంద్రబాబు సర్కార్ పూర్తి స్ధాయిలో టార్గెట్ చేయడం ఖాయమని అంచనా వేస్తున్న జగన్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications