ప్రత్యేక హోదా సెంటిమెంట్: జగన్ సక్సెస్, చంద్రబాబుకు చిక్కులు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని సెంటిమెంట్గా మార్చడంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫలితం సాధించారనే మాట వినిపిస్తోంది. భారీ ప్యాకేజీ పేరుతో ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకోవాలనే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా సాగుతున్నాయి. అయితే, అది సెంటిమెంట్గా మారడంతో ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి.
ప్రజల భావోద్వేగానికి సంబంధించిన అంశంగా ప్రత్యేక హోదా మారడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దానికోసమే పట్టుబట్టాల్సిన పరిస్థితిలో పడ్డారు. ప్రత్యేక హోదా సంజీవిని కాదని, దాని వల్ల సమస్యలన్నీ పరిష్కారమవుతాయనే మాట నిజం కాదని అంటూ చంద్రబాబు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలను ప్రస్తావించారు. ప్రత్యేక హోదా ఇచ్చినప్పటికీ ఆ రాష్ట్రాలు వెనకబడే ఉన్నాయని చెప్పారు.
కానీ, ఇప్పుడు ప్రత్యేక హోదా కావాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, చంద్రబాబు వైఖరి మార్చుకోవాల్సిన పరిస్థితి జగన్ వల్లనే ఏర్పడిందని అంటున్నారు. ప్రత్యేక హోదాపై జగన్ దీక్షలు చేయడంతో పాటు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలు చేశారు.
ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలపై ఆయన విద్యార్థులకు ఉపదేశించే కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి మెండుగా పరిశ్రమలు వస్తాయని, దానివల్ల యువతకు ఉద్యోగాలు లభిస్తాయని ఆయన ప్రధానంగా చెబుతూ వచ్చారు.
ప్రత్యేక హోదా వల్ల పన్ను మినహాయింపు లభిస్తుందని, దానివల్ల పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారని జగన్ చెప్పారు. ప్యాకేజీ వల్ల ఆ ప్రయోజనం చేకూరదని ఆయన వాదిస్తూ వస్తున్నారు. దీంతో ఆంద్రప్రదేశ్ ప్రజల్లో అది భావోద్వేగానికి సంబంధించిన అంశంగా మారింది. పైగా, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేస్తూ వస్తున్నారు.
మరోవైపు, 14వ ఆర్థిక సంఘానికీ ప్రత్యేక హోదాకు కేంద్ర ప్రభుత్వం ముడిపెట్టడాన్ని జగన్ వ్యతిరేకిస్తున్నారు. ఆర్థిక సంఘానికి దాన్ని నిరోధించే అధికారం లేదని ఆయన చెబుతున్నారు. ప్రత్యేకహోదా ఇచ్చే అంశం ప్రధాని చేతుల్లోనే ఉంటుందని కూడా ఆయన వాదిస్తున్నారు. ముఖ్యంగా, ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలపైనే జగన్ ప్రధానంగా దృష్టి సారించి, ప్రజల అభిప్రాయాన్ని ఆ దిశగా మలచడంలో విజయం సాధించారనే చెప్పాలి.