ఆవేశపడొద్దు, బాబు ఇక్కడే ఉన్నారు: టీడీపీని ఇరకాటంలో పడేసిన జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో నదుల అనుసంధానం పైన మంగళవారం చర్చ సాగింది. ఈ సందర్భంగా జగన్ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులకు చురకలు అంటించారు. జగన్ మాట్లాడుతుండగా.. టీడీపీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై జగన్ స్పందిస్తూ... చంద్రబాబు ఇక్కడే ఉన్నారని, ఆవేశపడవద్దని, మీకు మార్కులు పడతాయ్ కానీ కూర్చోండి అని సెటైర్ వేశారు. తద్వారా జగన్ టీడీపీ సభ్యులను కొంత ఇరకాటంలో పడేశారు.
ప్రాజెక్టుల పైన వైయస్ రాజశేఖర రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి మీకు ఉందా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదన్నారు. గోదావరిలో 60 రోజులు వరద వస్తుందని, కృష్ణా నదిలో 40 రోజులు వరదలు వస్తాయని జగన్ అన్నారు. స్టోరేట్ సామర్థ్యం కావాలంటే పోలవరం అవసరమ్నారు.

పోలవరం ప్రాజెక్టు ఏపీలోని మూడు ప్రాంతాలకు కావాల్సిన ప్రాజెక్టు అన్నారు. గాలేరు నగరి, హంద్రీనివాకు కేటాయించిన నిధులు జీతాలకు కూడా సరిపోవన్నారు. నీటి నిల్వ లేకుండా నీరు మళ్లింపు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పోలవరం పూర్తి కాకుంటే ఏపీకి ఇబ్బందులు తప్పవని, టీడీపీ చరిత్రహీనులుగా మిగులుతుందన్నారు.
జగన్ మాట్లాడుతుండగా.. టీడీపీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సభాపతి కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 10 నిమిషాలు అడిగిందని, కానీ ఇప్పటికే 25 నిమిషాలు మాట్లాడారని, ఇంకా సమయం కావాలంటే ఎలా అని ప్రశ్నించారు.
దానికి చంద్రబాబు స్పందిస్తూ.. విపక్షం ఇరిగేషన్ గురించి మాట్లాడుతుందని, సంతోషమని, వారు ఎంతసేపైనా మాట్లాడటానికి అవకాశమివ్వాలని సభాపతికి సీఎం చంద్రబాబు సూచించారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సభాపతి వద్దకు వెళ్లి జగన్ మాట్లాడేందుకు మరో పది నిమిషాలు కేటాయించాలని కోరారు. దీంతో సభాపతి జగన్కు మాట్లాడేందుకు అవకాశమిచ్చారు.












Click it and Unblock the Notifications