రహస్య ఎజెండా: పవన్పై జగన్ పార్టీ అనుమానం
హైదరాబాద్: కాంగ్రెసు నేత చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనస్థాపన ఉద్దేశంపై వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. జనసేన స్థాపన వెనక రహస్య ఎజెండా ఉందనే అనుమానాలను ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెసు పార్టీని తాను ఖతం చేయడానికి పనిచేస్తానని మాత్రమే పవన్ కళ్యాణ్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది అనుమానమేనని అన్నారు.
కాంగ్రెసు పార్టీని, దాని విధానాలను మాత్రమే విమర్శించారని, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీతో సహా ఏ పార్టీతోనైనా కలిసి పనిచేస్తానని ఆయన చెప్పారు. ఆ ప్రకటన వెనక బిజెపి, తెలుగుదేశం కూటమిని బలపరిచే ఎజెండా ఉన్నట్లు కనిపిస్తోందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. సీమాంధ్రలో వైయస్ జగన్ బలాన్ని తగ్గించడం కూడా ఆ ప్రకటన వెనక ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే కాంగ్రెసుకు వ్యతిరేకంగా సీమాంధ్రలోనూ తెలంగాణలోనూ కాంగ్రెసుకు వ్యతిరేకంగా ప్రచారం సాగించడానికి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఆయన గానీ, ఆయన అనుచరులు గానీ పోటీ చేస్తారా లేదా అనేది కూడా అనుమానంగానే ఉందని భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడిపై పవన్ కళ్యాణ్ ఏ విధంగానూ వ్యతిరేకంగా మాట్లాడలేదు. చంద్రబాబు మంచి మనిషి అని, అందరినీ ఒకేసారి ఎండగట్టలేం కదా అని మాత్రమే అన్నారు.
అదే సమయంలో వైయస్ జగన్ పేరు ఎత్తకుండా పెద్ద యెత్తున భూములు, వార్తాపత్రికలు, న్యూ చానెళ్లు తనకు లేవని అన్నారు. ఈ మాటలు జగన్కు గురిపెట్టినవేనని భావిస్తున్నారు. తనకు కులం, ప్రాంతం, మతం లేవని అన్నారు. పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా కాపునాడు ప్రతినిధులు మాట్లాడడం ఆయనపై ఏ విధమైన ప్రభావం చూపే అవకాశం లేదు. పైగా, తాను తెలుగుదేశం, బిజెపి కూటమికి ఉపయోగపడాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని, పోటీకి దిగడం లేదని, పైగా కాపునాడు ప్రతినిధులు తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారని, అందువల్ల అది కూడా తాను ఉద్దేశ్యాల మేరకే సాగుతోందని పవన్ అనుకుంటుండవచ్చునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు.