మనం పాఠాలు నేర్చుకోవాలి, ఎదగాలి - జగన్ లో కొత్త కోణం..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ లో మార్పు కనిపిస్తోంది. గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అధికారం కోల్పోయిన తరువాత వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు. పార్టీలో ప్రక్షాళన మొదలు పెట్టారు. కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. ఇదే సమయంలో మనం ఎదగాల్సి ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు. అదే సమయంలో సంస్కరణలు...మంచి పాఠాలు ఉంటే నేర్చుకుందామంటూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో చర్చగా మారాయి.
జగన్ లో మార్పు
మాజీ ముఖ్యమంత్రి జగన్ భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో పార్టీ నేతలను..కేడర్ ను పట్టించుకోలేదనే అభిప్రాయం ఉంది. తన కోటరి నేతలతోనే వ్యవహారాలన్నీ నడిపారు. వారి మితిమీరిన జోక్యం పార్టీ కేడర్ కు రుచించలేదు. ఎమ్మెల్యేలకు కలిసేందుకు జగన్ సమయం ఇవ్వలేదు. ప్రజలతో అధికారం వచ్చే వరకు దగ్గరగా ఉన్న జగన్ సీఎం అయిన తరువాత గ్యాప్ వచ్చింది. పార్టీలో ఎవరి పైన ఆరోపణలు వచ్చినా సీరియస్ గా తీసుకోలేదు. వారి పైన చర్యలు లేవు.

గతం కంటే భిన్నంగా
జగన్ ఓటమి తరువాత చేసిన విశ్లేషణలో అనేక అంశాలు తెర మీదకు వచ్చాయి. వాటిని సరిదిద్దుకొనే పని జగన్ ప్రారంభించారు. దాడుల్లో గాయపడిన కార్యకర్తలను పరామర్శిస్తున్నారు. పార్టీ శ్రేణులు కలిసేందుకు అందుబాటులో ఉంటున్నారు. నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏ ఘటన జరిగినా స్పందిస్తున్నారు. పార్టీ నేతలతో వరుస భేటీలో విశాఖ ఎమ్మెల్సీ గెలుచుకున్నారు. తాజాగా పార్టీ ముఖ్య నేతలకూ జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీలో సంస్థాగతంగా మార్పులు ప్రారంభించారు. తొలి నుంచి పార్టీలో పని చేసిన వారికి బాధ్యతలు అప్పగించారు.
దిశా నిర్దేశం
ఇక, దువ్వాడ శ్రీనివాస్ పైన రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతున్న సమయంలో ఆయన పైన చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారాయి. పార్టీలో అధినేత నుంచి కింది స్థాయి వరకు అందరూ యువకులేనని..మనం ఎదగాల్సి చాలా ఉందని జగన్ వ్యాఖ్యానించారు. సంస్కరణలు, మంచి పాఠాలు ఏవైనా మనం నేర్చుకోవాల్సినవి ఉంటే నేర్చుకుందాం అంటూ జగన్ దిశా నిర్దేశం చేసారు. జగన్ లో కనిపిస్తున్న ఈ మార్పు పైన సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. పార్టీలో రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా అధ్యక్షుల వరకు మార్పులకు జగన్ సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications